
హైదరాబాద్, వెలుగు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయ్యి చంచల్గూడ జైలులో ఉన్న ఇరిగేషన్ ఈఈ నూనె శ్రీధర్ను విచారణ కోసం ఏసీబీ ఐదు రోజుల కస్టడీకి తీసుకోనుంది. ఈ మేరకు నాంపల్లిలోని ఏసీబీ స్పెషల్ కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం (జూన్ 20) నుంచి మంగళవారం వరకు శ్రీధర్ ను కస్టడీకి అనుమతించింది.
దీంతో చంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న శ్రీధర్ను ఏసీబీ అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకోనున్నారు. బంజారాహిల్స్లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించి విచారించనున్నారు. నిందితుడి ఇంట్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా బినామీలను గుర్తించనున్నారు. బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయించే అవకాశం ఉందని తెలిసింది.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలోని గాయత్రి బాహుబలి పంప్హౌస్ ఇన్చార్జిగా కీలక బాధ్యతలు నిర్వహించిన శ్రీధర్పై ఏసీబీ ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా ఈనెల 11న రాష్ట్ర వ్యాప్తంగా 13 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. అవినీతి సంపాదన, బినామీల పేర్లతో కూడబెట్టినట్టు దాదాపు రూ.200 కోట్లకు పైగా విలువైన స్థిర, చరాస్తులను అధికారులు గుర్తించారు.
ఇవే కాకుండా బ్యాంకు లాకర్లు, బంగారు ఆభరణాల లెక్కలు తేలిస్తే.. అక్రమాస్తుల విలువ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీధర్ ను కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు.