
- కాళేశ్వరం ఆఫీసర్లకు ఏసీబీ టెన్షన్!
- కదులుతున్న అక్రమాల డొంక.. ఇద్దరు అధికారుల అక్రమాస్తులే రూ.350 కోట్లకు పైగా
- ఈఎన్సీ హరిరామ్ ఇప్పటికే జైలులో.. తాజాగా ఈఈ శ్రీధర్ అరెస్ట్
- తమపైనా దాడులు జరుగుతాయన్న భయంలో కొందరు అధికారులు
- ప్రాజెక్టు టెండర్ల నుంచీ అవినీతి జరిగినట్లు ఆరోపణలు
- పంప్హౌస్లలోనే రూ.14 వేల కోట్ల అక్రమాలను తేల్చిన కాగ్
- విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా చర్యలు ప్రారంభించిన రాష్ట్ర సర్కార్
- త్వరలో మరికొందరు ఆఫీసర్లపైనా ఏసీబీ దాడులు!
- పైస్థాయిలో వేల కోట్ల స్కామ్ జరిగి ఉండొచ్చని అనుమానాలు
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన అధికారులు ఒకరి తర్వాత ఒకరు అక్రమాస్తుల కేసుల్లో దొరికిపోతున్నారు. గత సర్కారులో అక్రమంగా వందల కోట్ల ఆస్తులు కూడబెట్టి ఇప్పుడు కటకటాలపాలవుతున్నారు. ఇప్పటికే ఈఎన్సీ హరిరామ్ జైలులో ఉండగా.. తాజాగా ఈఈ నూనె శ్రీధర్ ఏసీబీ అధికారులకు చిక్కారు. వాళ్లిద్దరి అక్రమ ఆస్తులు రూ.350 కోట్లకుపైగా ఉంటాయని ఏసీబీ లెక్కల్లో తేటతెల్లమైంది. ఈ ఇద్దరే కాదు.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ఇతర అధికారులకూ అవినీతిలో వాటా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఒక్కొక్కరుగా ఏసీబీ చేతికి చిక్కుతుండడంతో.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పనిచేసిన కొందరు కీలక ఇంజినీర్లకు బుగులు పట్టుకుంది. తమకు కూడా ఇదే పరిస్థితి వస్తుందేమోనన్న ఆందోళనలో వారు ఉన్నారు.
ప్రాజెక్టులో భారీ అవినీతి..!
కాళేశ్వరం టెండర్ల అప్పగింత నుంచి ప్రాజెక్టు ప్రారంభించేంత వరకు అడుగడుగునా అవినీతి జరిగిందన్న ఆరోపణలున్నాయి. ముఖ్యంగా కాంట్రాక్ట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరించినందుకు కిందిస్థాయి అధికారులు మొదలు రాజకీయ నాయకుల వరకు భారీగా కమీషన్లు నడిచినట్లు చర్చ మొదటి నుంచీ ఉంది. ముఖ్యంగా ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలు, పంప్హౌస్లు, వివిధ ప్యాకేజీల పనుల్లో భారీ అవకతవకలు జరిగాయనే ఆరోపణలున్నాయి. టెండర్లను నామినేషన్ పద్ధతిలో ఇవ్వడం.. ప్రభుత్వం కోట్ చేసిన దానికన్నా ఎక్కువకు టెండర్లను ఓకే చేయడంతోనే అవినీతి మొదలైందన్న వాదనలున్నాయి. ఆ తర్వాత పంప్హౌస్ల మోటార్ల కొనుగోళ్లలోనూ అక్రమాలు జరిగాయనే ఆరోపణలూ వచ్చాయి. అసలు పంప్హౌస్లలోనే దాదాపు రూ.14 వేల కోట్లకుపైగా అక్రమాలు జరిగినట్లు కాగ్ రిపోర్ట్తేల్చింది.
మొత్తం 21 ప్యాకేజీల్లో పంప్హౌస్లలో 8,338 మెగావాట్ల సామర్థ్యమున్న పంపులు, మోటార్లను రూ.18,900 కోట్లతో కొనుగోలు చేశారు. అందులో 6, 8, 10, 11 ప్యాకేజీల్లోని మోటార్లకు 327 శాతం అదనంగా చెల్లించారంటూ కాగ్ పేర్కొంది. ఆ నాలుగు ఫేజుల్లో 7,212 కోట్లు ఖర్చవుతాయని నాటి సర్కార్ అంచనా వేసినా.. నిర్మాణ సంస్థలు మాత్రం కేవలం రూ.1,686 కోట్లే బీహెచ్ఈఎల్కు చెల్లించినట్లు కాగ్ తేల్చి చెప్పింది. బ్యారేజీలు, పంప్హౌస్ల కంప్లీషన్ సర్టిఫికెట్లు, సిమెంట్ వర్క్స్ తదితర అంశాల్లోనూ భారీగా అక్రమాలు జరిగాయన్న ఆరోపణలూ ఉన్నాయి.
పైస్థాయిలో ఇంకెంత దోచుకున్నరో..
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం పనిచేసిన కిందిస్థాయి అధికారులే ఒక్కొక్కరు వందల కోట్లు కమీషన్లు తీసుకుంటే నిర్ణయాత్మక స్థాయిలో ఉన్న వారు ఇంకెంత దోచుకొని ఉంటారోనన్న చర్చ ఇరిగేషన్ వర్గాల్లో కొనసాగుతున్నది. లక్ష కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ప్రస్తుతం పనికిరాకుండా పోయింది. ఏడో బ్లాక్ కుంగిపోవడంతో అవినీతి బయటకు వస్తున్నది. అక్రమార్కుల డొంకలు కదులుతున్నాయి. పైస్థాయిలో వేల కోట్లు చేతులు మారి ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద అధికారులు, నేతల దృష్టంతా కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్ల మీదే ఉండడంతో క్వాలిటీ లేక బ్యారేజీలు దెబ్బతిన్నాయని ఇరిగేషన్ నిపుణులు అంటున్నారు.
అందినకాడికి దోచుకున్నరు..
కాళేశ్వరం ప్రాజెక్టులో కొందరు అధికారులు అందినకాడికి దోచుకున్నారన్న ఆరోపణలు ఇరిగేషన్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కొందరు ఉన్నతాధికారులైతే గత ప్రభుత్వానికి వంత పాడుతూ భారీగా వెనుకేసుకున్నారనే వాదనలూ ఉన్నాయి. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ డిపార్ట్ మెంట్ కూడా.. అధికారుల అవినీతిని రిపోర్ట్లో తేల్చిచెప్పింది. కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారంటూ తీవ్రంగా స్పందించింది. ఈ నేపథ్యంలోనే 17 మంది అధికారులపై క్రిమినల్ చర్యలకు విజిలెన్స్ డిపార్ట్మెంట్సిఫార్సు చేసింది. కాగా, అందులో కొందరు అధికారులు తమ తప్పేమీ లేదని చెప్తున్నారు.
మరికొందరు అధికారులపై మాత్రం విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాంటి అధికారులే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూసి కలవరపడుతున్నట్లు ఇరిగేషన్స్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తున్నది. ప్రభుత్వం కూడా విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగానే అవినీతి అధికారులపై చర్యలకు ఉపక్రమించినట్లు చర్చ జరుగుతున్నది. కాళేశ్వరంలో పనిచేసిన మరికొందరు అధికారులపైనా రాబోయే రోజుల్లో రైడ్స్ జరగొచ్చని, అరెస్టులు చేసే అవకాశాలు లేకపోలేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.