
-
త్వరలో నిర్మాణ సంస్థలనూ పిలుస్తం
-
అందరూ నిబంధనల ప్రకారమే వ్యవహరించాలి
-
బ్యారేజీలు సరిగా పనిచేస్తే ఎంతో లాభం
-
కాళేశ్వరం కమిషన్ చీఫ్ పీసీ ఘోష్
హైదరాబాద్: ఈ నెల 25వ తేదీలోపు తమ విచారణకు హాజరైన వారందరూ అఫిడవిట్లు ఫైల్ చేయాలని, తప్పుడు అఫిడవిట్లు ఇస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కాళేశ్వరం కమిషన్ చీఫ్ పీసీ ఘోష్ చెప్పారు. ఇవాళ ( జూన్ 11) జలసౌధలో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఇవాళ 20 మందితో సమావేశమైనట్టు తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన, తెలిసిన అంశాలన్నింటినీ అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని చెప్పామని అన్నారు.
నిన్న, ఇవాళ ( జూన్ 10,11) ఇంజినీర్లతో సమావేశమైనట్టు తెలిపారు. రేపటి ( జూన్ 12) నుంచి ఏం చేయాలనేదానిపై జాబితాను సిద్ధం చేస్తామని అన్నారు. త్వరలో నిర్మాణ సంస్థలనూ విచారణకు పిలుస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ నిబంధనల ప్రకారమే వ్యవహరించాలని అన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో అధికారుల పేర్లు ఉంటే వారికి కూడా నోటీసులు ఇస్తామని ఘోష్ వెల్లడించారు. బ్యారేజీలు సరిగా పనిచేస్తే ప్రజలకు ఎంతో లాభం జరుగుతుందని అన్నారు. ఎక్కడో ఏదో తప్పుడు లెక్కల వల్ల ఇలా జరిగినట్టు అనిపిస్తోందని తెలిపారు.