
- విజిలెన్స్, ఎన్డీఎస్ఏ, కాగ్ రిపోర్టుల పరిశీలన
- ఇంజినీర్లు, నిర్మాణ సంస్థలు, ప్రభుత్వ పెద్దలను ప్రశ్నించిన ఘోష్
- ప్రభుత్వానికి ఏం రిపోర్ట్ ఇవ్వబోతున్నారు..?
- ఎవరిని దోషులుగా తేల్చబోతున్నారు..? ఆధారలేంటి..?
- ఆసక్తికరంగా మారిన కాళేశ్వరం రిపోర్ట్
హైదరాబాద్: కాళేశ్వరంలో కీలకమైన కేసీఆర్ విచారణ పూర్తయింది. ఇప్పటి వరకు 115 మందిని విచారించిన కమిషన్ ఏం తేల్చబోతోందనేది ఆసక్తికరంగా మారింది. 15 నెలల క్రితం సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పీసీ ఘోష్ నేతృత్వంలో ఏర్పాటైన కమిషన్ గడువును ప్రభుత్వం ఆరు సార్లు పొడిగించింది.
ఏప్రిల్ నెలాఖరు నాటికి 400 పేజీలతో కమిషన్ నివేదికను సిద్ధం చేసింది. కేసీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్ ను విచారణకు పిలవక పోవచ్చనే లీకులు వచ్చాయి. ఏప్రిల్ 30వ తేదీతోనే గడువు ముగుస్తుందని అంతా భావించారు. అనూహ్యంగా ప్రభుత్వం కమిషన్ గడువు పెంచింది. ఇదే క్రమంలో కేసీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్ కు నోటీసులు జారీ అయ్యాయి.
ఈ నెల 6న ఈటల రాజేందర్ ను, 9న మాజీ మంత్రి హరీశ్ రావును, 11న మాజీ సీఎం కేసీఆర్ ను కమిషన్ విచారించింది. ఈ ముగ్గురూ కూడా దాదాపు ఒకే సమాధానం చెప్పారు. నిన్న కేసీఆర్ విచారణ ఇన్ కెమెరాలో జరగగా ఆయనను అడిగిన ప్రశ్నలు, జవాబులు బయటికి వచ్చాయి. అంతా అధికారులు, ఇంజినీర్ల సూచనల మేరకే చేసినట్టు ముగ్గురు చెప్పుకొచ్చారు. అంతకు ముందు పీసీ ఘోష్ కమిషన్ ఈఎన్సీలు, చీఫ్ ఇంజీనీర్లు, రిటైర్డ్ ఇంజినీర్లు, ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను విచారించింది. వారి నుంచి సమాధానాలు రాబట్టింది. వారితోపాటు నిర్మాణ సంస్థల ప్రతినిధులతోనూ మాట్లాడింది. వారి నుంచి సమాధానాలు రాబట్టడంతోపాటు ప్రతి దీ అఫిడవిట్ రూపంలో తీసుకుంది.
మూడు నివేదికల అధ్యయనం
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో జరిగిన అవినీతిపై విచారణ జరుపుతున్న పీసీ ఘోష్కమిషన్ మూడు నివేదికలను పరిశీలించింది. కాళేశ్వరం అక్రమాలపై తేల్చేందుకు ఏర్పాటు చేసిన విజిలెన్స్ కమిటీ విచారణ నివేదికను తెప్పించుకుంది. అదే సమయంలో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) నివేదిక ను కూడా తెప్పించుకొని పరిశీలించింది.
ఆర్థిక పరమైన అంశాల కోసం కాగ్ నివేదికను కూడా చూసింది. ఈ మూడు నివేదికలను బేరీజు వేసుకోవడంతోపాటు, 115 మంది చెప్పిన సమాధానాలు, ఇచ్చిన అఫిడవిట్ల ఆధారంగా తుది నివేదికను సిద్ధం చేసి ఎవరు దోషి అన్నది తేల్చాల్సి ఉంటుంది. కేసీఆర్ మెదడు కరిగించి రూపొందించినట్టు చెబుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పాపం ఎవరికి చుట్టుకుంటుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
సీఎం వద్ద ఉన్న ఆధారాలేంటి?
కాళేశ్వరం అక్రమాలను రెండు మూడు రోజుల్లో బట్టబయలు చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో మీడియాతో చేసిన చిట్ చాట్ లో చెప్పారు. ఈ ప్రాజెక్ట్పై ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమవడం ఆసక్తికరంగా మారింది. సీఎం మాట్లాడిన తర్వాత తాను కూడా మాట్లాడతానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ వివరాలు బయటపెట్టబోతున్నారనే ఆసక్తి నెలకొంది