కృష్ణాలో వరద ఉన్నా కల్వకుర్తి బంద్

కృష్ణాలో వరద ఉన్నా కల్వకుర్తి బంద్

లిఫ్ట్ స్కీంలోని మొత్తం పంపులను ఆపేసిన ఆఫీసర్లు
పంపు ఆపరేటర్లకు కరోనా వచ్చిందని నిలిపివేత
క్వారంటైన్ ముగిశాకే తిరిగి స్టార్ట్ చేస్తామంటున్న ఇంజనీర్లు
2 లక్షల క్యూసెక్కుల వరద పోతున్నా లిఫ్టు చేసుకోలేని దుస్థితి
నాగర్కర్నూల్, వెలుగు: కల్వకుర్తి లిఫ్టుస్కీమ్కు ఏటా ఏదో ఒక సమస్య వస్తోంది. గతేడాది మోటార్లు, పంపులు సతాయించడంతో లక్ష్యం మేర సాగునీరు ఇవ్వలేకపోయారు. ఈసారి చిన్న కారణంతో వారం నుంచి పంపులన్నీ బంద్ పెట్టారు. కృష్ణా నదికి వరద మొదలు కాగానే ఎల్లూరు లిఫ్టులో రెండు పంపులనే నడిపిన ఆఫీసర్లు జులై 20న జొన్నల బొగడ వద్దరెండు పంపులు ఆన్ చేశారు. మూడు రోజుల తర్వాత గుడిపల్లిగట్టు లిఫ్ట్ లో పంపులు ఆన్ చేయాల్సి ఉండగా, మంత్రి నిరంజన్ రెడ్డి రాకపోవడంతో వాయిదా వేశారు. ఆగస్టు2న మంత్రి షెడ్యూల్ ఖ‌రారు కావడంతో12 రోజుల తర్వాత ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ క్రమంలో ఎల్లూరు పంపుహౌస్లో పనిచేసే పంప్ ఆపరేటర్ల‌కు ఆగస్టు 2న కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆపరేటర్ల‌ను క్వారంటైన్ కు పంపించారు. పంపులు నడిపేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేయకుండా అన్ని మోటార్ల‌ను ఆఫ్ చేశారు.

ఆయకట్టుకు నీరు అందేనా?

కల్వకుర్తి లిఫ్టు ద్వారా నాగర్ క‌ర్నూల్, వనపర్తి, మహబూబ్ నగర్ జిల్లాల్లోని ఆరు నియోజకవర్గాల పరిధిలోని 500 చెరువులను నిం పి, 4 లక్షల 20 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనేది లక్ష్యం. ఎల్లూరు, జొన్నలబొగడ, గుడి పల్లిగట్టు పంపుహౌస్లలో 30 మెగావాట్ల కెపాసిటీ గల ఐదు పంపులు ఏర్పాటు చేశారు. 5 పంపులు ఉన్నా ప్రధాన కాల్వల కెపాసిటీ తక్కువగా ఉండడంతో మూడు పంపులకు మించి నడపడం లేదు. ఏటా జులై చివర్లో పంపులు స్టార్ట్ చేస్తున్నప్పటికీ ప్రధానంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోని 90 ఫ్లడ్ డేస్ లో 40 టీఎంసీలను ఎత్తిపోయాల్సి ఉంది. ఇంత చేసినా లక్ష్యంలో సగం అంటే 2 లక్షల ఎకరాలకు కూడా నీళ్లందడం లేదని రైతులు, రైతుసంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. కానీ కీలక టైంలో పంపులు బంద్ పెట్టడంతో ఆ ఆయకట్టు కూడా ప్రశ్నార్ద‌కం కానుంది.

మెయింటనెన్స్ చెల్లింపులు లేక మూడేండ్లు..

పంపుహౌస్ ల మెయింటనెన్స్ మొత్తం ప్రైవేట్ కాంట్రాక్టర్ల‌కు అప్పగించారు. మూడున్నరేండ్లుగా మెయింటె నెన్స్డబ్బులు రిలీజ్ చేయడంలేదని, దాంతో తాము జీతాలు ఇవ్వలేకపోతున్నామని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. కల్వకుర్తికి సంబంధించి రూ.15 కోట్లు పెండింగ్లో ఉండటంతో కాంట్రాక్టర్లు నిర్ల‌క్ష్యం చేస్తున్నారని, ప్రత్యామ్నాయ ఆపరేటర్ల‌ను ఏర్పాటు చేయలేదని తెలుస్తోంది. మూడు లిఫ్టుల పరిధిలోని రిజర్వాయర్లు, ప్రధాన కాల్వలు, బ్రాంచ్ కెనాల్స్ త‌రుచూ తెగిపోతున్నాయి. కాల్వల్లోకనీసం గడ్డితొలగింపు నిధులు ఇవ్వక రెండేండ్లవుతోంది. బలహీనంగా మారిన కాల్వ కట్టలూ తెగుతున్నాయి. కాల్వలకు నీళ్లు వదిలాక వర్షం వస్తే ఎక్కడ తెగుతాయోనని రైతులు, ఇంజనీర్లు ఆందోళన చెందుతున్నారు.

ఆపరేటర్లు లేక పంపులు ఆపేశాం..

కేఎల్ఐ మొదటి లిఫ్ట్ ఎల్లూరులో పనిచేసే నలుగురు పంప్ ఆపరేటర్లకు కరోనా వచ్చింది. వారిని వెంటనే హోం క్వారంటైన్ కు పంపించాం. నలుగురు ఆపరేటర్లను తమ గ్రామంలో ఉంచొద్దని ఊరోళ్లు ఒత్తిడి చేయడంతోనే ఇలా చేయాల్సి వచ్చింది. ఆల్టర్నేట్ ఆపరేటర్లు లేనందనే పంపులు ఆపేశాం. ఆగస్టు15 తర్వాత ఆపరేటర్లు డ్యూటీలో చేరతారు.16న పంపింగ్ స్టార్ట్ చేస్తాం. -శ్రీకాంత్,ఈఈ, కేఎల్ఐ

మ‌రిన్ని వార్త‌ల కోసం