కామారెడ్డి/కామారెడ్డి టౌన్, వెలుగు: పనస పండ్ల మాటున వ్యాన్లో అక్రమంగా భారీ మొత్తంలో తరలిస్తున్న గంజాయిని కామారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 387 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోగా, దీని విలువ రూ.1.93 కోట్లు ఉంటుందని తెలిపారు. జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర ఆదివారం మీడియాకు వివరాలు వెల్లడించారు.
ఒడిశా సరిహద్దు నుంచి మహారాష్ట్రలోని నాసిక్కు గంజాయి రవాణా జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ మధుసూదన్ పర్యవేక్షణలో సీఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బందితో శనివారం సాయంత్రం కామారెడ్డి మండలం క్యాంసపల్లి శివారులోని హైవేపై తనిఖీలు నిర్వహించారు.
అనుమానాస్పదంగా వచ్చిన ఓ వ్యాన్ను పరిశీలించారు. పైభాగంలో పనస పండ్లు కనిపించేలా అమర్చి, వాటి కింద సంచుల్లో భారీగా గంజాయి దాచినట్లు గుర్తించారు. షేక్ కరీముల్లా, గైని సుభాష్, షేక్ రహీంను అరెస్ట్ చేశారు.
