భూమి కోసం సెల్​టవర్​ ఎక్కిన బాధితుడు

భూమి కోసం సెల్​టవర్​ ఎక్కిన బాధితుడు


మూడు గంటల పాటు హంగామా

కామారెడ్డి టౌన్, వెలుగు: తన భూమిని కొందరు కబ్జా చేశారని, తనకు న్యాయం చేయాలంటూ బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్అండ్​బీ గెస్ట్​హౌజ్​వద్ద ఉన్న సెల్​టవర్​ఎక్కి టౌన్​కు చెందిన బెజుగాం ఓంకార్​ మూడు గంటల పాటు హంగామా చేశాడు. పోలీసులు, ఫైర్​సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఓంకర్​ను కిందికి దిగాలని నచ్చజెప్పారు. టౌన్​సీఐ నరేశ్​ బాధితుడితో ఫోన్​లో మాట్లాడారు. అతడి కుటుంబ సభ్యులను కూడా పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

మూడు గంటల తర్వాత ఓంకార్​ టవర్ ​దిగివచ్చాడు. అతడు మాట్లాడుతూ.. పట్టణంలోని మున్సిపల్​ ఆఫీస్ ​ఎదుట తనకు ఎకరం 10 గుంటల భూమి ఉందని, అందులో 10 గుంటల భూమిని కొందరు కబ్జా చేశారన్నారు. కోర్టులో కేసు కూడా నడుస్తోందని, ల్యాండ్ ​దగరకు వెళ్తే, కబ్జా చేసిన వారు కొట్టారన్నారు. న్యాయం కోసం పోలీస్​స్టేషన్​కు వెళ్లినా లాభం లేకుండా పోయిందని వాపోయారు. అందుకే సెల్​టవర్​ఎక్కి నిరసన తెలిపినట్లు పేర్కొన్నాడు. ఆఫీసర్లు తనకు న్యాయం చేయాలని కోరాడు. అనంతరం బాధితుడిని పోలీసులు ఠానాకు తరలించారు.