ప్రముఖ కన్నడ నటుడు అనంత్ నాగ్ను 2024 ఏడాదికి గాను ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. భారతీయ సినిమాకు ఆయన అందించిన విశేష సేవలు, విశిష్టమైన సినీ ప్రస్థానానికి గుర్తింపుగా ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపిక చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ద్వారా అనంత్ నాగ్కు అభినందనలు తెలిపారు. ఈనెల 22న గుజరాత్లోని కెవాడియాలో జరగనున్న 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రధానోత్సవంలో రాష్ట్రపతి దౌపదీ ముర్ము ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.
ఇక 1973లో ‘సంకల్ప’ అనే కన్నడ చిత్రంతో కెరీర్ ప్రారంభించిన అనంత్ నాగ్.. కన్నడతో పాటు తెలుగు, మలయాళ, మరాఠి, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో 300కి పైగా చిత్రాల్లో నటించారు. శ్యామ్ బెనెగల్ తెరకెక్కించిన మంథన్, కొండుర, కల్యుగ్ చిత్రాలతో పాటు ఆర్కే నారాయణ్ కథల ఆధారంగా తీసిన ‘మాల్గుడి డేస్’ సీరియల్ ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. తెలుగులో ప్రేమలేఖలు, అనుగ్రహం, భీష్మ, బాలు, శంఖారావం లాంటి చిత్రాల్లో ఆయన నటించారు. నటుడిగా ఐదుసార్లు కర్ణాటక స్టేట్ అవార్డ్స్ అందుకున్న ఆయన్ను గత ఏడాది పద్మభూషణ్తో కేంద్రం సత్కరించింది.
