
బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ ట్రోఫీ విజయోత్సవ వేడుకలపై విమర్శలు ఆగడం లేదు. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోవడం చాలా బాధగా ఉందని లెజెండ్ క్రికెటర్ కపిల్ దేవ్ అన్నాడు. ‘సంబురాల కంటే జీవితాలు గొప్పవి’ అని తన బాధను వ్యక్తం చేశాడు. భవిష్యత్లోనైనా ఇలాంటివి జరగకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాడు. ‘జరిగిన సంఘటన నన్ను కలిచి వేసింది. మనం ఒకరి నుంచి ఒకరం నేర్చుకోవాలి.
ఇలాంటి సంబురాలు జరిగినప్పుడు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వ్యవహరించాలి. తప్పు అనేది సరదాగా గడిపి ప్రాణాలు కోల్పోయేంత పెద్దదిగా ఉండకూడదు. భవిష్యత్లో ఏదైనా జట్టు గెలిస్తే దానికి సంబంధించి వేడుకలు ప్రశాంతంగా చేసుకోండి' అని కపిల్ వ్యాఖ్యానించాడు. మరోవైపు తొక్కిసలాట మృతులకు బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ నివాళి అర్పించాడు. ఇది మాటలకందని విషాదమని వ్యాఖ్యానించాడు. ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని వెల్లడించాడు.