కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలో దారుణం జరిగింది. ముగ్గురు పూజారులు దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం ఉదయం మాండ్యా నగర శివార్లలోని గుత్తాలు వద్ద ఉన్న శ్రీ అరకేశ్వర ఆలయ ప్రాంగణంలో ముగ్గురు పూజారులను గుర్తు తెలియని దుండగులు హతమార్చి ఆలయంలోని హుండీ నగదు, నగలు దోచుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
ఉదయం భక్తులు గుడికి వెళ్లగా.. ఆ ప్రాంతంలో పడి ఉన్న మృతదేహాలను చూసిన పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల దర్యాప్తులో పలు విషయాలు వెల్లడయ్యాయి. శ్రీ అరకేశ్వర ఆలయంలో పూజారులుగా పనిచేసే గణేష్, ప్రకాష్, ఆనంద్ లు వరుసకు అన్నదమ్ముళ్లు. వీరు ఉదయం వేళల్లో పూజలు నిర్వహిస్తూ, రాత్రి సమయంలో గుడిలోనే నిద్రిస్తుంటారు. ఇదే క్రమంలో గురువారం రాత్రి నిద్రిస్తున్న వారిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి తలలపై బండరాళ్ల మోది హతమార్చి ఉంటారని తెలిపారు. ఈ క్రమంలో శుక్రవారం గుడికి వెళ్లిన భక్తులకు విగతజీవులుగా కనిపించారని అన్నారు.
సదరన్ రేంజ్ ఐజీపీ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితులను పర్యవేక్షించారు. ఇప్పటివరకు హంతకులకు సంబంధించి ఎలాంటి ఆధారం దొరకలేదని వెల్లడించారు. జాగిలాలను రంగంలోకి దింపామని, ఫోరెన్సిక్ నిపుణులు కూడా క్రైంసీన్లో సాక్ష్యాలు సేకరించే పనిలో ఉన్నారని తెలిపారు. కాగా ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి యడ్యూరప్ప మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.