రోడ్ల దుస్థితిపై సామాజిక కార్యకర్త వినూత్న నిరసన

రోడ్ల దుస్థితిపై సామాజిక కార్యకర్త వినూత్న నిరసన

ఇటీవల కర్ణాటకలో కురిసిన వర్షాలకు రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారాయి. ఈ నేపథ్యలో ఉడిపి జాతీయ రహదారి సమీపంలోని ఇంద్రాణి బ్రిడ్జి ధ్వంసమైంది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఇప్పటివరకూ అక్కడి ప్రభుత్వం రోడ్డు రిపేరింగ్ పనులను చేపట్టలేదు. దీంతో నిత్యానంద ఒలకడ అనే ఓ సామాజిక కార్యకర్త వినూత్నంగా నిరసన తెలిపాడు. గుంతలు పడ్డ ఆ రోడ్డుపై పొర్లు దండాలు పెట్టి... ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది చూసిన స్థానిక జనం అక్కడ గుమికూడారు. పోలీసులు సైతం అక్కడికి చేరుకొని అతన్ని అక్కడ్నుంచే తరలించే ప్రయత్నం చేశారు. అయితే కొత్త రోడ్లు వేసేందుకు టెండర్లు వేసి మూడేండ్లు గడుస్తున్నా పనులు ఇంకా చేపట్టలేదని నిత్యానంద ఆరోపిస్తున్నాడు. గతుకుల రోడ్డుపై ప్రయాణం చేస్తున్న ప్రజలు ఎన్నో  ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రోడ్డు రిపేరింగ్ పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.