కర్ణాటకలో మహిళ పై చేయి చేసుకున్న మంత్రి

కర్ణాటకలో మహిళ పై చేయి చేసుకున్న మంత్రి

కర్ణాటకలోని ప్రభుత్వ కార్యక్రమంలో ఓ మంత్రి వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చామరాజ్‌నగర్ జిల్లాలోని హంగాలా గ్రామంలో భూమి పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి సోమన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా 175 మందికి పట్టాలను పంపిణీ చేశారు. అయితే.. లబ్ధిదారుల ఎంపిక విషయంలో తనకు అన్యాయం జరిగిందని అడగడానికి వచ్చిన కెంపెమ్మ అనే మహిళ పై మంత్రి చేయి చేసుకున్నాడు. నన్నే ప్రశ్నిస్తావా అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. 

లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా జరగలేదని కెంపెమ్మ ఆరోపించింది. అర్హత ఉన్నా తనను ఎంపిక చేయలేదని.. స్థానిక కాంగ్రెస్ నేత నంజప్ప సూచించిన వారికే టైటిల్ డీడ్‌లు ఇచ్చారని ఆమె ఆరోపణలు చేశారు. ఈ విషయంలో మంత్రిని ఆమె నిలదీయడంతో.. మంత్రి చేయి చేసుకున్నాడు. దీంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. బాధితురాలు మంత్రి కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేయడంతో ఆమెను పోలీసులు వేదిక పై నుంచి కిందకు దింపేశారు. మంత్రి తీరుపై విమర్శలు వెల్లువెత్తడంతో తర్వాత ఆయన క్షమాపణలు చెప్పారు.