కార్తీక మాసం ప్రాముఖ్యత ఏంటి.... ఎలాంటి పూజలు చేయాలి?

కార్తీక మాసం ప్రాముఖ్యత ఏంటి.... ఎలాంటి పూజలు చేయాలి?

కార్తీకముతో సమానమైన మాసము లేదు. విష్ణు దేవునితో సమానమయిన దేవుడు లేడు. గంగతో సమానమగు తీర్థము లేదు అని చెప్పబడినది. తెల్లవారుజామునే నిద్రలేవడం, ప్రవహిస్తూ ఉన్నటువంటి నీళ్లలో స్నానాన్ని చేయడం, బోళాశంకరునికి నిత్యమూ రుద్రాభిషేకం చేయడం, నుదుట విభూతినీ మెడలో రుద్రాక్షల్నీ- లేదా- తులసి పూసల్ని ధరించండం రోజుకి ఒక పూట మాత్రమే భుజించడం, ఉసిరిక చెట్టు నీడలో వనభోజనాలు చేయడం...ఒకటేమిటి? ఇలా ఎన్నెన్నో సంప్రదాయాలని మూటగట్టుకుని తెచ్చింది పవిత్రమైన ఈ కార్తీకమాసం. ఈ కార్తీక మాసంలో చేసే వ్రతములలో ముఖ్యమైనవి కార్తీకస్నానం. ఇంతటి పవిత్రమైన కార్తీక మాసంలో ఏయే నియమాలు పాటించాలో తెలుసుకుందాం. .

కార్తీక మాసం శివుడికి, మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. కార్తీక పురాణంలో కార్తీక సోమవారం,  జ్వాలాతోరణం  మహాశివుడి ప్రాముఖ్యతను తెలియజేస్తే  బలి పాడ్యమి, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి శ్రీ మహావిష్ణువు  ప్రాముఖ్యతను స్పష్టంగా తెలియజేస్తాయి. కార్తీక పురణాంలో కూడా మొదటి 15 అధ్యాయాలు ఈశ్వరుడి ప్రాముఖ్యతను, ఆఖరి 15 అధ్యాయాలు శ్రీహరి ప్రాధాన్యతను తెలియజేస్తాయి. 

కార్తీకస్నానం ఎందుకు?

కార్తీక మాసంలో రవి తులా రాశిలో ఉండటం వల్ల నదిలో నదీ ప్రవాహానికి ఎదురుగా నిలబడి స్నానం ఆచరించడం వల్ల శరీరానికి శక్తి కలిగి ఆరోగ్యంగా ఉంటారు. పురాణాల పరంగా కార్తీక నెలరోజులూ సూర్యోదయానికి ముందు నదీస్నానం చేస్తే సకల పాపాలు నశిస్తాయని అంటారు.

దీపం వెలిగించాలి

‘దీపం జ్యోతి పరబ్రహ్మం.. దీప జ్యోతి జనార్దన.. 
దీపో మేహరతు పాపం.. సంధ్యాదీపం నమోస్తుతే!

దీపమే పరబ్రహ్మం. దీపంలో లక్ష్మీ దేవి ఉందనీ.. దీపం నుంచి వచ్చే తేజస్సులో బ్రహ్మ, విష్ణు,మహేశ్వరులు ఉన్నారనీ పురాణాలు చెబుతున్నాయి. అజ్ఞానం అనే అందకారాన్ని తొలగించి జ్ఞానాన్నిస్తుంది అనేందుకు దీపం చిహ్నమని చెబుతారు.

 నిత్యం దీపారాధన చేసే ఇంట్లో ఎలాంటి దోషాలు ఉండవని చెబుతారు. అయితే ఏడాదంతా దీపారాధన చేయనివారు కనీసం కార్తీకమాసంలో అయినా దీపం వెలిగించాలి, ఇదికూడా కుదరకపోతే కార్తీక సోమవారం, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో అయినా వెలిగించాలని చెబుతారు. ముఖ్యంగా కార్తీకమాసంలో సంధ్యాదీపం ప్రధానం. సాయంత్రం పూట ఆలయంలో గానీ, తులసికోట, రావిచెట్టు వద్దగానీ,  మేడపైన, ఏదైనా నదివద్ద దీపారాధన చేస్తే శివానుగ్రహం లభిస్తుందని కార్తీకపురాణంలో ఉంది.

ఉపవాసం..

వాస్తవంగా చెప్పాలంటే ఉపవాసం దేవుడికోసం కాదు మన ఆరోగ్యం కోసం చేయాలి. వారంలో ఓ రోజు ఉపవాసం ఉండడం జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. మనసు నిర్మలంగా మారి దైవం వైపు మళ్లుతుంది. కార్తీక సోమవారాల్లో ఉపవాసం ఉండటం కేవలం ఆహారాన్ని మానేయడం కాదు.. కోరికలు పక్కనపెట్టి ధ్యాసను భగవంతుడిపై లగ్నం చేయడం. ఉపవాసం ఉన్న ప్రతిక్షణం మనసు భగవంతుడిపై లగ్నం చేసి భగవతారాధనలో గడిపిన వారికి ఉపవాస ఫలం సిద్ధిస్తుంది. కార్తీక ఏకాదశి మొత్తం ఉపవాసం ఉండి ద్వాదశి రోజు ఉదయాన్నే స్నానమాచరించి శివకేశవలకు పూజ చేసి బ్రాహ్మణులకు లేదా అతిథులకు భోజనం పెట్టాక తినాలి. ఇలా చేస్తే  శ్రీమహావిష్ణువు అనుగ్రహం కలిగి విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని కార్తిక పురాణంలో ప్రస్తావించారు.

దానం..

సనాతన ధర్మంలో గృహస్థులు చేయాల్సిన ముఖ్యమైన పనుల్లో స్నానం, దానం, జపం, తర్పణం. అన్ని నెలల్లో కన్నా కార్తీక మాసంలో చేసే స్నాన, దాన, జప, తర్పణాలకు అధిక పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే కార్తిక మాసంలో ఎవరైతే నవధాన్యాలు, అన్నం, దీపదానం, ఉసిరి దానం, వస్త్రదానం, సువర్ణ దానం, గోదానం, కన్యాదానం చేస్తారో వారికి కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుందని మార్కండేయ, శివ పురాణాలు చెబుతున్నాయి. 

కార్తీకమాసంలో వీటికి దూరంగా ఉండండి

  • లైంగిక వాంఛలు పెంచే ఉల్లి, వెల్లుల్లి, మధ్యం, మాంసం ముట్టుకోరాదు
  • ఎప్పుడూ ఎవ్వరికీ ద్రోహం చేయకూడదు..కనీసం ఓ నియమంలా పాటిస్తూ ఈ నెలరోజులైనా పాపపు ఆలోచనలు మానేయాలి
  • విశ్వాసం ఉంటే దేవుడిని పూజించండి లేదంటే మానేయండి... దైవదూషణ మాత్రం చేయకండి
  • దీపారాధనలకు తప్ప నువ్వుల నూనె ఇతరత్రా అవసరాలకు ఉపయోగించకండి
  • మినుములు తినకూడదు, నలుగుపెట్టుకుని స్నానం చేయకూడదు
  • కార్తీక వ్రతం పాటించేవారు ఆ వ్రతం చేయని వారి చేతి వంట తినకూడదు