కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ రూపొందించిన చిత్రం ‘సర్దార్’. రాశీఖన్నా, రజీషా విజయన్ హీరోయిన్స్. లైలా కీలక పాత్ర పోషించింది. రేపు సినిమా విడుదల కానున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. చీఫ్ గెస్ట్ నాగార్జున మాట్లాడుతూ ‘తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నందుకు గర్వపడుతున్నాను. ఒక స్టార్ హీరో తమ్ముడు అయ్యుండి కూడా ఆ షాడో పడకుండా ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడం చాలా కష్టం. తెలుగులో పవన్ కళ్యాణ్, కన్నడలో పునీత్, తమిళంలో కార్తి అలా నిలబడ్డారు. కార్తిని అభిమానించే తెలుగు ప్రేక్షకులంతా ఈ సినిమాని ఆదరిస్తారని ఆశిస్తున్నా’ అన్నారు.
కార్తీ మాట్లాడుతూ ‘నాగార్జున గారు నాకు ఇన్స్ఫిరేషన్. ‘ఊపిరి’ షూటింగ్ నా కెరీర్లోనే బెస్ట్ మెమొరీ. ఆయన నా సినిమాను రిలీజ్ చేస్తుండడం హ్యాపీ. నా కెరీర్లోనే ఇది ఇంపార్టెంట్ మూవీ. డ్యుయెల్ రోల్ చేశా. పల్లెటూరి యువకుడు స్పైగా మారితే ఎలా ఉంటుందో చూపించే థ్రిల్లర్. అరవయ్యేళ్ల వయసుండే స్పై క్యారెక్టర్ చాలా స్పెషల్. ఎలాంటి గుర్తింపు లేకున్నా దేశం కోసం పోరాడే అన్సంగ్ హీరోస్ వాళ్లు. ఆ పాత్రలో నటించడం గర్వంగా అనిపించింది. సోషల్ మీడియా క్రేజ్ కోసం ఆరాటపడే మరో పోలీస్ క్యారెక్టర్ కూడా చేశా. రెండు డిఫరెంట్ జనరేషన్ క్యారెక్టర్స్ని ఒకే సినిమాలో పోషించడం చాలెంజింగ్గా అనిపించింది. ఒక ఇంపార్టెంట్ ఇష్యూని చర్చించాం. అదేమిటన్నది సర్ప్రైజ్. ‘ఖైదీ’ దీపావళికే వచ్చి మెప్పించింది. మళ్లీ ఈ దీపావళికి క్రాకర్లా ఈ సినిమా వస్తోంది. కచ్చితంగా నచ్చుతుంది’ అన్నాడు. ‘యాక్షన్, రొమాన్స్, ఎమోషన్స్, ఇంటెన్సిటీ, థ్రిల్లింగ్ అంశాలు ఉన్న పర్ఫెక్ట్ దీపావళి ట్రీట్ ఇది. కచ్చితంగా ఆకట్టుకుంటుంది’ అంది రజీషా. ‘సూర్యతో కలిసి నటించిన ‘శివపుత్రుడు’ దీపావళికి వచ్చి మెప్పించింది. కార్తితో నటించిన ‘సర్దార్’ కూడా దీపావళికే వస్తోంది. కచ్చితంగా ఆకట్టుకుంటుంది’ అంది లైలా.