
- స్టూడెంట్స్, టీచర్ను గదిలో బంధించిన ఎస్ఓ
- సస్పెండ్ చేసిన డీఈఓ
బెల్లంపల్లి రూరల్, వెలుగు : మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్లో రోజూ పెడుతున్న భోజనంలో పురుగులు, రాళ్లు వస్తున్నాయని, తినలేక అర్ధాకలితో అలమటిస్తున్నామని బుధవారం విద్యార్థులు టిఫిన్ తినకుండా స్కూల్ఆవరణలో ధర్నా చేశారు. రోడ్డుపైకి వెళ్లి బైఠాయించేందుకు ప్రయత్నించగా స్పెషల్ ఆఫీసర్అమూల్య అడ్డుకొని మెయిన్ గేట్లకు తాళాలు వేశారని స్టూడెంట్స్ ఆరోపించారు. విద్యార్థుల కథనం ప్రకారం..హాస్టల్లో మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా రోజూ కిచిడి, ఉడికి, ఉడకని అన్నం పెడుతున్నారు. వంటలు బాగుండడం లేదని ఎస్ఓ దృష్టికి తీసుకెళ్తే స్పందించడం లేదు. దీంతో బుధవారం స్టూడెంట్స్ స్కూల్ ఆవరణలో ధర్నా చేశారు. తర్వాత రోడ్డుపైకి వెళ్లేందుకు ప్రయత్నించగా ఎస్ఓ అమూల్య అడ్డుకున్నారు.
బెదిరించి గదిలోకి తీసుకెళ్లి గొళ్లెం పెట్టారు. ప్రశ్నించిన సీనియర్ టీచర్ పద్మ ఫోన్ లాక్కుని ఆమెను కూడా లోపలేసి బేడం పెట్టారు. విషయం తెలుసుకున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య, డీఈఓ వెంకటేశ్వర్లు, ఎస్సై రాజశేఖర్, ఎంఈఓ మహేశ్వర్రెడ్డి, ఎంపీపీ రమాదేవి వచ్చి మెయిన్ గేట్ తాళం తీయించారు. లోపలికి వెళ్లి స్టూడెంట్స్తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్ఓ అమూల్య నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో డీఈఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడికక్కడే ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. స్టూడెంట్స్, టీచర్ల నుంచి వివరాలు తీసుకుని కలెక్టర్కు నివేదిక పంపనున్నట్టు చెప్పారు.