పురుగులన్నం పెడుతున్నరు! : నెన్నెలలో కస్తూర్బా విద్యార్థుల ధర్నా

పురుగులన్నం పెడుతున్నరు! : నెన్నెలలో కస్తూర్బా విద్యార్థుల ధర్నా
  • స్టూడెంట్స్, టీచర్​ను గదిలో బంధించిన ఎస్​ఓ
  • సస్పెండ్ ​చేసిన డీఈఓ  

బెల్లంపల్లి రూరల్, వెలుగు : మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్​లో రోజూ పెడుతున్న భోజనంలో పురుగులు, రాళ్లు వస్తున్నాయని, తినలేక అర్ధాకలితో అలమటిస్తున్నామని బుధవారం విద్యార్థులు టిఫిన్​ తినకుండా స్కూల్​ఆవరణలో ధర్నా చేశారు. రోడ్డుపైకి వెళ్లి బైఠాయించేందుకు ప్రయత్నించగా స్పెషల్​ ఆఫీసర్​అమూల్య అడ్డుకొని మెయిన్​ గేట్లకు తాళాలు వేశారని స్టూడెంట్స్​ ఆరోపించారు. విద్యార్థుల కథనం ప్రకారం..హాస్టల్​లో మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా రోజూ కిచిడి, ఉడికి, ఉడకని అన్నం పెడుతున్నారు. వంటలు బాగుండడం లేదని ఎస్ఓ దృష్టికి తీసుకెళ్తే స్పందించడం లేదు. దీంతో బుధవారం స్టూడెంట్స్​ స్కూల్​ ఆవరణలో ధర్నా చేశారు. తర్వాత రోడ్డుపైకి వెళ్లేందుకు ప్రయత్నించగా ఎస్​ఓ అమూల్య అడ్డుకున్నారు.

బెదిరించి గదిలోకి తీసుకెళ్లి గొళ్లెం పెట్టారు. ప్రశ్నించిన సీనియర్ ​టీచర్​ పద్మ ​ఫోన్ ​లాక్కుని ఆమెను కూడా లోపలేసి బేడం పెట్టారు. విషయం తెలుసుకున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య, డీఈఓ వెంకటేశ్వర్లు, ఎస్సై రాజశేఖర్​, ఎంఈఓ మహేశ్వర్​రెడ్డి, ఎంపీపీ రమాదేవి వచ్చి మెయిన్​ గేట్ తాళం తీయించారు. లోపలికి  వెళ్లి స్టూడెంట్స్​తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్ఓ అమూల్య నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో డీఈఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడికక్కడే ఆమెను సస్పెండ్​ చేస్తున్నట్లు ప్రకటించారు. స్టూడెంట్స్, టీచర్ల నుంచి వివరాలు తీసుకుని కలెక్టర్​కు నివేదిక పంపనున్నట్టు చెప్పారు.