యూట్యూబర్: గుమ్మం దాటకుండానే.. దునియాకు దగ్గరైంది.. 35 మంది జీవితాలనే మార్చేసింది !

యూట్యూబర్: గుమ్మం దాటకుండానే.. దునియాకు దగ్గరైంది.. 35 మంది జీవితాలనే మార్చేసింది !

ఆమె ఎన్నో కట్టుబాట్ల మధ్య పెరిగింది. కోడళ్లు ఊరు దాటి వెళ్లకూడదు అని నమ్మే ఒక గ్రామీణ ప్రాంతం వాళ్లది. అందుకే గుమ్మం దాటకుండానే తన గురించి ప్రపంచానికి తెలిసేలా చేసింది కౌసల్య. రూ. 7,500 పెట్టి కొన్న తన స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌తో వీడియోలు తీసి యూట్యూబ్‌‌‌‌లో అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేసింది. అలా సోషల్‌‌‌‌ మీడియాలో ఫేమస్ అయ్యింది. ఇప్పుడు ‘సిధి మార్వాడి’ పేరుతో స్పైసెస్‌‌‌‌ బ్రాండ్‌‌‌‌ని ఏర్పాటు చేసి తనలాంటి మరో 35 మంది మహిళల జీవితాలను మార్చేసింది. 

ఒక మంచి యూట్యూబ్‌‌‌‌ వీడియో తీయాలంటే రింగ్ లైట్, క్వాలిటీ మైక్‌‌‌‌, ఫ్యాన్సీ కెమెరా, ఏఐ టూల్స్‌‌‌‌, ఇంటర్నెట్ కనెక్షన్ లాంటివన్నీ తప్పనిసరి. కానీ.. కౌసల్య కేవలం ఒక బేసిక్‌‌‌‌ స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌తో వీడియోలు తీసి అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేసింది. ఆమెది రాజస్థాన్‌‌‌‌లోని కురి అనే చిన్న గ్రామం. ఏ సౌకర్యాలు లేకపోయినా దృఢ సంకల్పం, వంట పట్ల ప్రేమతో యూట్యూబ్‌‌‌‌ జర్నీ మొదలుపెట్టింది. తన కిచెన్‌‌‌‌నే టెంపరరీ స్టూడియోగా మార్చుకుంది. 

యూట్యూబ్‌‌‌‌లో వీడియోలు చూసి, నోట్స్ రాసుకుని వీడియో ఎడిటింగ్‌‌‌‌ నేర్చుకుంది. ఊళ్లో ఇంటర్నెట్‌‌‌‌ సిగ్నల్స్‌‌‌‌ కూడా సరిగ్గా లేకపోవడంతో ఒక్కోసారి వీడియో అప్‌‌‌‌లోడ్ చేయడానికి రాత్రంతా ఇంటి పైకప్పుపైనే ఉండేది. రాత్రింబవళ్లు ఆమె చేసిన కృషికి ఇప్పుడు ఫలితం దక్కింది. ఆమె ఇప్పుడు డిజిటల్‌‌‌‌  కంటెంట్‌‌‌‌ క్రియేటర్ మాత్రమే కాదు. ‘సిధి మార్వాడి’ అనే ఫుడ్‌‌‌‌ బ్రాండ్‌కి ఫౌండర్‌‌‌‌‌‌‌‌ కూడా. దీని ద్వారా సంప్రదాయ రాజస్థానీ మసాలాలు, కోల్డ్-ప్రెస్డ్ ఆయిల్స్‌‌‌‌ని ప్రపంచవ్యాప్తంగా అమ్ముతోంది. 

పనులకే పరిమితం

కౌసల్య సాధారణ వ్యవసాయ కుటుంబంలో పెరిగింది. ఉదయం ఆవులకు మేత వేసి స్కూల్‌‌‌‌కి వెళ్లేది. సాయంత్రం ఇంటికొచ్చాక పొలానికి వెళ్లి పనులు చేసేది. నలుగురు తోబుట్టువుల్లో తనే పెద్దది కావడంతో తల్లి పొలం పనుల్లో బిజీగా ఉన్నప్పుడు వంటపని కూడా చేసేది. చిన్నప్పటినుంచే డాక్టర్ కావాలని కలలు కన్నది. అందుకే 12వ తరగతిలో సైన్స్ గ్రూప్ తీసుకుంది. ఆమె ఒకటి తలిస్తే.. దేవుడు మరొకటి తలిచాడు. 12వ తరగతి బోర్డ్‌‌‌‌ ఎగ్జామ్స్‌‌‌‌ పూర్తవగానే తల్లిదండ్రులు పెండ్లి చేసేశారు.

 ‘‘పెండ్లి తర్వాత నేను కూడా మా అమ్మలాగే వ్యవసాయ పనులకే పరిమితం అయ్యాను. 12 సంవత్సరాలు చదువుకున్నదంతా వృథానేనా అనిపించింది. మా గ్రామంలో ఉద్యోగ అవకాశాలు తక్కువ. అక్కడి సామాజిక నిబంధనల వల్ల కోడళ్లు బయటి పనులు చేయడానికి ఒప్పుకోరు. పైగా నా మెట్టినింటికి నేనే ఏకైక కోడలిని. అందుకే ఉద్యోగం చేస్తానంటే మా అత్తగారు ‘ఇంటి పనులు ఎవరు చేస్తారు? ఇంటికి వచ్చే అతిథులను ఎవరు చూసుకుంటారు?’ అనేది” అంటూ తను ఎదుర్కొన్న సమస్యలను చెప్పుకొచ్చింది కౌసల్య. 

ఐదేళ్ల చిన్నారి స్ఫూర్తితో

ఒకసారి పేపర్‌‌‌‌‌‌‌‌లో ఐదేళ్ల చిన్నారి యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదిస్తున్నట్లు వచ్చిన ఒక వార్తా కథనం చదివింది కౌసల్య. అప్పటివరకు ఆమె దగ్గర స్మార్ట్‌‌‌‌ ఫోన్‌‌‌‌ కూడా లేదు. అందుకే యూట్యూబ్‌‌‌‌ గురించి పెద్దగా తెలియదు. తన భర్త వీరేంద్ర కుమార్‌‌‌‌ను యూట్యూబ్ గురించి అడిగి తెలుసుకుంది. ఆ తర్వాత తను కూడా యూట్యూబ్‌‌‌‌లో వీడియోలు చేయాలని నిర్ణయించుకుంది. వాళ్ల మామని స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌ కొనివ్వమంటే ఆయన రూ. 3,000తో బటన్లు ఉండే ఫోన్ తెచ్చి ఇచ్చి.. తన స్థోమత అంతే అని చెప్పాడు. 

ఆ ఫోన్‌‌‌‌తో ఉపయోగం లేదని తిరిగి వాళ్ల మామకే ఇచ్చేసింది. ఆమె దగ్గర అప్పటివరకు పొదుపు చేసి దాచుకున్న రూ. 3000 ఉన్నాయి. మరో రూ. 4500 వాళ్ల అమ్మని అడిగింది. మొత్తం రూ. 7500 పెట్టి 2017లో  ఒక శామ్‌‌‌‌సంగ్‌‌‌‌ ఫోన్ కొన్నది. దాంతో కుకింగ్‌‌‌‌ వీడియోలు చేయడం ప్రారంభించింది. అలా మొదటిగా ‘బేసన్ బర్ఫీ’ వీడియో అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేసింది. కానీ.. వ్యూస్‌‌‌‌ పెద్దగా రాలేదు. 

ట్రైపాడ్‌‌‌‌ కూడా లేదు

మొదట్లో వీడియోలు చేయడానికి చాలా కష్టపడింది కౌసల్య. కనీసం ఆమెకు ట్రైపాడ్ కూడా లేదు. అల్యూమినియం వైర్లను మలిచి ఒక స్టాండ్‌‌‌‌లా మార్చుకుంది. స్టూడియో లైట్లు లేవు. వంటగదిలో ఉన్న బల్బు వెలుతురులోనే వీడియోలు చేసింది. వీడియోలను అప్‌‌‌‌లోడ్ చేయడానికి కూడా చాలా కష్టపడింది. వాళ్ల ఊరిలో నెట్‌‌‌‌వర్క్ సరిగ్గా ఉండేది కాదు. అందుకే వీడియో అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేయడానికి ఇంటి పైకప్పు ఎక్కి గంటల తరబడి వెయిట్‌‌‌‌ చేసేది. వీడియో ఎడిటింగ్​ నేర్చుకోవడానికి ట్యుటోరియల్స్​ చూసేది. 

అందులో చెప్పే విషయాలను నోట్స్ రాసుకునేది. అలా ఎంతో కష్టపడి వీడియోలు చేస్తే యూట్యూబ్‌‌‌‌ నుంచి ఆమెకు ఫస్ట్ పేమెంట్‌‌‌‌ రూ. 7,500 రావడానికి ఏడాదిన్నర పట్టింది.

ముందు హిందీలో...
 
కౌసల్య మొదట్లో హిందీలో కంటెంట్ చేసేది. కానీ.. ఆ వీడియోలకు పెద్దగా రీచ్‌‌‌‌ రాలేదు. వీడియోలు చూసేవాళ్లు కొన్ని ఇంగ్రిడియెంట్స్‌‌‌‌ పేర్లు అర్థం కాక మళ్లీ ఆమెని అడిగేవాళ్లు. అప్పుడే ఆమెకు ఇంటర్నెట్‌‌‌‌ చౌకగా రావడంతో లక్షల మంది గ్రామీణ మహిళలు వీడియోలు చూస్తున్నారని.. అలాంటివాళ్ల కోసం కంటెంట్‌‌‌‌ చేయాలని అర్థమైంది. అందుకే రాజస్థానీలో వీడియోలు చేసింది. దాంతో ఒక్క నెలలోనే లక్ష మంది సబ్‌‌‌‌స్క్రైబర్లు వచ్చారు. వీడియోలకు మిలియన్లలో వ్యూస్‌‌‌‌ వచ్చాయి. యూట్యూబ్‌‌‌‌ నుంచి పది రోజులకే దాదాపు రూ. లక్ష వచ్చాయి. హిందీలో వీడియోలు చేసినప్పుడు లక్ష సంపాదించడానికి రెండు సంవత్సరాలు పట్టింది. 

సంప్రదాయ పద్ధతులు..  

ఆమె వీడియోల్లో రెసిపీలతో పాటు సామెతలు, ప్రజలు మర్చిపోతున్న సంప్రదాయ రాజస్థానీ పద్ధతుల గురించి కూడా చెప్తుంటుంది. అది చాలామందికి నచ్చింది. అందుకే వ్యూస్‌‌‌‌ బాగా పెరిగాయి. దాంతో 2023లో మాస్టర్‌‌‌‌చెఫ్ ఇండియా షో నుంచి ఫోన్‌‌‌‌ వచ్చింది. ఆమె దాన్ని సీరియస్‌‌‌‌గా తీసుకోలేదు. ఎవరో ప్రాంక్ కాల్‌‌‌‌ చేశారనుకుని ఫోన్​ని భర్త వీరేంద్రకు ఇచ్చింది. వాళ్లు కౌసల్యని ఆడిషన్స్‌‌‌‌కు తీసుకురమ్మని చెప్పారు. ఆ ఫోన్‌‌‌‌ కాల్ వల్ల ఆమె జీవితం మరోసారి మారిపోయింది. ఆ షోలో రాజస్థాన్ నుంచి టాప్ 12లో చోటు దక్కించుకున్న ఏకైక పార్టిసిపెంట్‌‌‌‌గా నిలిచింది. కాచి హల్దీ కి సబ్జీ, కుగా రోటి, మఖానియా లస్సీ లాంటి రాజస్థానీ పురాతన వంటకాలు చేసి జడ్జీలను మెప్పించింది. 

సిధి మార్వాడి బ్రాండ్‌‌‌‌ 

ఇండియాలో టిక్‌‌‌‌టాక్‌‌‌‌ని బ్యాన్​ చేయడంతో ఆమె 15 లక్షలమంది ఫాలోవర్స్‌‌‌‌ని, ఆదాయాన్ని కోల్పోయింది. ‘‘నాకు యూట్యూబ్, ఇన్‌‌‌‌స్టాగ్రామ్, ఫేస్‌‌‌‌బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌ల ద్వారానే డబ్బులు వస్తున్నాయి. టిక్‌‌‌‌టాక్‌‌‌‌లాగే ఆ ప్లాట్‌‌‌‌ఫామ్స్‌‌‌‌ కూడా పోతే ఎలా? అనిపించింది. అందుకే సొంతంగా ఏదైనా బిజినెస్‌‌‌‌ పెట్టాలని నిర్ణయించుకున్నా” అన్నది కౌసల్య. మాస్టర్ చెఫ్‌‌‌‌ నుంచి తిరిగి వచ్చాక 2024 మార్చిలో ‘సిధి మార్వాడి’ పేరుతో ఒక స్పైసెస్‌‌‌‌ బ్రాండ్‌‌‌‌ని ఏర్పాటుచేసింది. ఈ బిజినెస్‌‌‌‌ పెట్టడానికి మరో కారణం కూడా ఉంది. విదేశాల్లో ఉన్న ఆమె బంధువులు విదేశీ మసాలాలు, నూనెలతో తయారు చేసిన ఫుడ్‌‌‌‌ అంత రుచిగా ఉండడం లేదని చెప్పేవాళ్లు.

 అలాంటి వాళ్లకు అసలైన ఇండియన్‌‌‌‌ మసాలాను అమ్మేందుకు ఈ బిజినెస్​ని ఎంచుకుంది. పూర్వీకులు వాడిన ప్రిజర్వేటివ్స్ లేని ప్యూర్‌‌‌‌‌‌‌‌ స్పైసెస్‌‌‌‌, కోల్డ్-ప్రెస్డ్ ఆయిల్స్‌‌‌‌ని దేశవిదేశాల్లో అమ్ముతోంది. మొదట్లో రాజస్థానీలు ఎక్కువగా వాడే గథియాలను (సుగంధ ద్రవ్యాల కట్టలు) తయారు చేసి మొదటి బ్యాచ్‌‌‌‌ అమ్మింది. ఆ తర్వాత మరో 10 కిలోలకు ఆర్డర్లు వచ్చాయి. దాంతో బిజినెస్‌‌‌‌ని విస్తరించింది. ప్రస్తుతం సిద్ధి మార్వాడికి దేశవ్యాప్తంగా 15 అవుట్‌‌‌‌లెట్లు ఉన్నాయి. ఆమె బిజినెస్‌‌‌‌లో సక్సెస్‌‌‌‌ అయిన తర్వాత చుట్టు పక్కల గ్రామాల్లో ఉంటున్న సుమారు 35 మందికిపైగా మహిళలకు ఉపాధి కల్పించింది. 

భర్త సపోర్ట్‌‌‌‌తో

యూట్యూబ్‌‌‌‌ నుంచి మొదటి పేమెంట్‌‌‌‌ వచ్చేవరకు ఆమె ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. ‘‘నాతో వీడియోలు చేయడం ఆపించేయమని ఎంతోమంది మా ఫ్యామిలీకి చెప్పారు. వాళ్లంతా వీడియోలు చేయడం, సోషల్ మీడియాలో కనిపించడం మంచి కల్చర్‌‌‌‌‌‌‌‌ కాదని భావించేవాళ్లు. కానీ నా భర్త ఎప్పుడూ నాకు సపోర్ట్‌‌‌‌గానే ఉన్నాడు” అంటోంది కౌసల్య.
“నా దృష్టిలో యూట్యూబ్‌‌‌‌ వీడియోలు చేయడం తప్పేమీ కాదు. అందుకే ఎప్పుడూ ఆమె నిర్ణయాలకు అడ్డు చెప్పలేదు. కౌసల్య సక్సెస్‌ అయ్యాక భార్య సంపాదనతో బతుకుతున్నాననే విమర్శలు కూడా ఎదుర్కొన్నా” అని చెప్పుకొచ్చాడు వీరేంద్ర.   

లక్షల్లో వ్యూస్​ 

కౌసల్య పెట్టిన యూట్యూబ్‌‌‌‌ చానెల్‌‌‌‌ ‘సిధి మార్వాడి’ని 16.5 లక్షల మంది సబ్‌‌‌‌స్క్రయిబ్‌‌‌‌ చేసుకున్నారు. చానెల్‌‌‌‌లో ఇప్పటివరకు 363 వీడియోలు అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేసింది. ఇప్పుడు కుకింగ్ వీడియోలతోపాటు వ్లాగ్స్‌‌‌‌ కూడా చేస్తోంది. తన బ్రాండ్‌‌‌‌తోపాటు ఇతర బ్రాండ్లను కూడా యూట్యూబ్‌‌‌‌ ద్వారా ప్రమోట్‌‌‌‌ చేస్తూ డబ్బు సంపాదిస్తోంది.