
హైదరాబాద్, వెలుగు: రాజకీయ కక్షతోనే మాజీ సీఎం కేసీఆర్ కుకాళేశ్వరం కమిషన్ పేరుతో నోటీసులు ఇచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. అది కాళేశ్వరం కమిషన్ కాదని, కాంగ్రెస్ కమిషన్అని ఆమె విమర్శించారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దేందుకు కేసీఆర్కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని, ఆ ప్రాజెక్టుపై కాంగ్రెస్ వాళ్లకు మొదటి నుంచీ కడుపుమంటగానే ఉందని మంగళవారం ఓ ప్రకటనలో మండిపడ్డారు.
పేద ప్రజలు బాగుపడడం కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ ఇష్టం ఉండదని, ప్రజలు పేదరికంలో ఉంటేనే తమకు పదవులు వస్తాయని భావించే నాయకత్వం కాంగ్రెస్ పార్టీదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మొదటి నుంచీ కాంగ్రెస్ నేతలు కుట్రలు పన్నుతున్నారని, ఎన్నో కేసులు వేశారని మండిపడ్డారు. రాజకీయ కుట్ర, కక్షతో వేసిన ఇలాంటి కమీషన్లు కాలక్రమంలో తప్పకుండా న్యాయాన్నే గెలిపిస్తాయని చెప్పారు. పాలేవో, నీళ్లేవో త్వరలోనే తెలుస్తాయని కవిత పేర్కొన్నారు.