ఆ దయ్యాలు, కోవర్టులు ఎవరు..పొలిటికల్​ సర్కిల్​లో, బీఆర్​ఎస్​ వర్గాల్లోనూ డిస్కషన్​

ఆ దయ్యాలు, కోవర్టులు ఎవరు..పొలిటికల్​ సర్కిల్​లో, బీఆర్​ఎస్​ వర్గాల్లోనూ డిస్కషన్​
  • పొలిటికల్​ సర్కిల్​లో, బీఆర్​ఎస్​ వర్గాల్లోనూ డిస్కషన్​
  • లేఖ ఎట్ల బయటకొచ్చిందనే దానిపైనా అనుమానాలు
  • కేసీఆర్​, కేటీఆర్​, హరీశ్​రావు సైలెన్స్​

హైదరాబాద్​, వెలుగు: కేసీఆర్​ చుట్టూ దయ్యాలు, కోవర్టులు ఉన్నారంటూ కవిత చేసిన కామెంట్లు ఇప్పుడు రాజకీయ వర్గాలతోపాటు బీఆర్​ఎస్​ పార్టీలోనూ చర్చకు దారితీశాయి. ఆ దయ్యాలు, కోవర్టులు ఎవరని గులాబీ లీడర్లు కూడా ఆరా తీస్తున్నారు. కవిత రాసిన లేఖను ఎవరు బయటకు లీక్​ చేశారన్న దానిపై డిస్కస్​ చేస్తున్నారు. కవిత లేఖ, తాజా పరిణామాలపై కేసీఆర్​, కేటీఆర్​, హరీశ్​రావు సైలెంట్​గా ఉన్నారు. పెదవి విప్పడం లేదు. కవిత తన తండ్రి కేసీఆర్​కు లేఖ రాసి రెండు వారాలవుతున్నా ఇన్నాళ్లూ గుట్టుగానే ఉంది. గురువారం బయటకు లీక్​ అయింది. దీంతో పార్టీలో లుకలుకలున్నాయన్న టాక్​ జోరందుకుంది.

 ఏప్రిల్​ 27న నిర్వహించిన బీఆర్​ఎస్​ సిల్వర్​ జూబ్లీ వేడుకలప్పుడు కేటీఆర్​ను రాజకీయ వారసుడిగా చూపించేందుకు కేసీఆర్​ ప్రయత్నం చేశారన్న వార్తలు వచ్చాయి. అయితే, పార్టీలో తనకు సమ ప్రాధాన్యం కావాలంటూ కొద్దికాలంగా కవిత  చెప్తున్నట్లూ బీఆర్​ఎస్​ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఇదే క్రమంలో కవిత కూడా జాగృతి పేరిట కార్యక్రమాలను నిర్వహిస్తూ.. యాక్టివ్​గా ఉంటున్నారు. గత పదేండ్లలో సామాజిక తెలంగాణ సాకారం కాలేదంటూ మే డే కార్యక్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్​ టాపిక్​గా మారాయి.  తెలంగాణ భవన్​లో మీడియాతో చిట్​చాట్​లోనూ ఆమె తన ఆవేదనను వెలిబుచ్చారు. తనను ఇంకా ఎంత ఇబ్బంది పెడతారని, తనపై కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. 

తండ్రికి రాసిన లేఖకే ప్రైవసీ లేకపోతే..!

ఇప్పుడు కవిత లేఖ బయటకు రావడంతో.. పార్టీలో అంతర్గతంగా ఏదో జరుగుతున్నదన్న చర్చ బీఆర్​ఎస్​ వర్గాల్లో జోరుగా సాగుతున్నది. పార్టీ సిల్వర్​ జూబ్లీ వేడుకలపై ఫీడ్​ బ్యాక్​ ఇస్తూ కవిత ఈ నెల 2న కేసీఆర్​కు లేఖ రాశారు. అందులో పాజిటివ్​, నెగెటివ్​ అంశాలను ప్రస్తావించారు. ‘‘డాడీ.. సభలో మీరు బీజేపీని మరింత టార్గెట్​ చేయాల్సింది. అలా చేయకపోయే సరికి ఆ పార్టీతో పొత్తుపెట్టుకుంటారనే ఊహాగానాలు మన పార్టీ కేడర్​లో వినిపిస్తున్నాయి” అని అందులో పేర్కొన్నారు. ఆ లేఖ తానే రాశాననని శుక్రవారం హైదరాబాద్​కు రాగానే కవిత క్లారిటీ ఇచ్చారు. 

ఆ లేఖ ఎలా బయటకు వచ్చిందో ఆలోచించాల్సిన అవసరం ఉందని, తన తండ్రికి రాసిన లేఖకే ప్రైవసీ లేకపోతే.. పార్టీలోని ఇతరుల పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్​ చుట్టూ దయ్యాలున్నాయని, కోవర్టులను పక్కన పెట్టాలని అన్నారు. ఈ వ్యాఖ్యలు బీఆర్​ఎస్​లో ముసలం ముదురుతున్నదనడానికి నిదర్శనమని పొలిటికల్​ సర్కిల్స్​లో చర్చ నడుస్తున్నది. ఇంత జరుగుతున్నా ‘గులాబీ’ పెద్దలెవరి నుంచి స్పందన లేదు. కేటీఆర్​, హరీశ్​ రావు ఇతర అంశాలపై ఎక్స్​లో ట్వీట్​లు  పెడుతున్నా.. కవిత లేఖ అంశంపై మాత్రం పెదవి విప్పడంలేదు.  ఓ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్​ను మీడియా ప్రతినిధి.. కవిత లేఖ అంశాన్ని ప్రస్తావించగా.. ‘‘మాట్లాడుతా మాట్లాడుతా బ్రదర్​.. మాకు లేని హడావిడి మీకెందుకు?’’ అంటూ వెళ్లిపోయారు.