కేటీఆర్ కుటుంబ సభ్యులను కూడా వదల్లేదు: ఫోన్ ట్యాపింగ్‎పై కవిత సంచలన వ్యాఖ్యలు

కేటీఆర్ కుటుంబ సభ్యులను కూడా వదల్లేదు: ఫోన్ ట్యాపింగ్‎పై కవిత సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: బీఆర్ఎస్‏కు రాజీనామా చేసిన కల్వకుంట్ల కవిత.. ఆ పార్టీ కీలక నేతలు హరీష్ రావు, సంతోష్ రావులపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. కాళేశ్వరం అవినీతి వెనక ఉన్నది హరీష్ రావు, సంతోష్ రావేనని.. ఆ ఇద్దరూ అవినీతి అనకొండలని ఆరోపించారు. హరీష్ రావు, సంతోష్ రావు వల్లే తన తండ్రి కేసీఆర్‎కు అవినీతి మరక అంటిందన్నారు కవిత. ఇదిలా ఉండగానే.. హరీష్ రావు, సంతోష్ రావులపై మరో బాంబ్ పేల్చారు కవిత. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హరీష్ రావు, సంతోష్ రావే ఫోన్ ట్యాపింగ్ చేయించారని సెన్సేషనల్ ఎలిగేషన్స్ చేశారు కవిత. 

మా కుటుంబంలో కూడా నలుగురికి ఫోన్ ట్యాపింగ్ నోటీసులు వచ్చాయని.. నా సిబ్బంది ఫోన్లు కూడా ట్యాప్‌ చేశారని తెలిపారు. హరీష్‌, శ్రవణ్‌రావు, సంతోష్‌ ముగ్గురూ కలిసి అందరి ఫోన్లు ట్యాప్‌ చేయించారని.. చివరకు కేటీఆర్‎ను కూడా వదల్లేదని.. కేటీఆర్ కుటుంబ సభ్యులు, సిబ్బంది ఫోన్లు ట్యాప్ చేయించారని ఆరోపించారు. అందరి గుట్టు దగ్గర పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీని చేజిక్కించుకోవాలనుకుని కుట్ర చేశారని వ్యాఖ్యానించారు కవిత. 

అలాగే.. బీఆర్ఎస్ పార్టీలోని అంతర్గత పరిస్థితులపై తన తండ్రి కేసీఆర్‎కు తాను రాసిన లేఖను లీక్ చేసింది కూడా సంతోష్ రావేనని ఆరోపించారు కవిత. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేసిన వేళ బీఆర్ఎస్ హయాంలో హరీష్ రావు, సంతోష్ రావు, శ్రవణ్ రావు అందరి ఫోన్లు ట్యాప్ చేయించారని కవిత అనడం సంచలనంగా మారింది. 

ALSO READ : తెలంగాణ పచ్చగా ఉంటే కొంతమందికి నచ్చడం లేదు.. అందుకే కేసీఆర్ను బద్నాం చేయాలని చూస్తున్నరు

పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ వేటు వేయడంతో కవిత ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‎కు పంపించారు. హరీష్ రావు, సంతోష్ రావే కుట్ర చేసి తనను సస్పెండ్ చేసేలా కుట్ర చేశారని కవిత ఆరోపించారు.