హైదరాబాద్, వెలుగు: సిరిసిల్ల సభలో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని మాజీ సీఎం కేసీఆర్కు ఎలక్షన్ కమిషన్ (ఈసీ) నోటీసులు ఇవ్వగా, వివరణ ఇచ్చేందుకు తనకు వారం రోజులు గడువు కావాలని ఈసీని కేసీఆర్ కోరారు. ఈ మేరకు ఆయన ఈసీకి గురువారం లేఖ రాశారు. ఇటీవల సిరిసిల్లలో పర్యటించిన కేసీఆర్.. కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. దీంతో కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
ఆ ఫిర్యాదును స్వీకరించిన ఈసీ.. కేసీఆర్కు మంగళవారం నోటీసులు జారీ చేసింది. గురువారం ఉదయం 11 గంటల్లోగా వివరణ ఇవ్వాలని అందులో పేర్కొంది. కాగా, కుక్కల కొడుకుల్లారా, లత్కోరోళ్లు, చవటలు, దద్దమ్మలు అంటూ కాంగ్రెస్ నేతలపై కేసీఆర్ కామెంట్లు చేశారు. వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వకపోతే ‘గొంతుల్ని కోసేస్తాం.. చంపేస్తాం’ అని వ్యాఖ్యానించారు.