కాంగ్రెస్​ను  బంగాళాఖాతంలో  వేద్దాం.. నిర్మల్ బహిరంగ సభలో కేసీఆర్ 

కాంగ్రెస్​ను  బంగాళాఖాతంలో  వేద్దాం..  నిర్మల్ బహిరంగ సభలో కేసీఆర్ 
  • కాంగ్రెస్​ను  బంగాళాఖాతంలో  వేద్దాం
  • ధరణి పోర్టల్ వద్దని.. పాత రెవెన్యూ వ్యవస్థే కావాలంటున్నరు   
  • నిర్మల్ బహిరంగ సభలో కేసీఆర్ 
  • పోడు పట్టాదారులకు ఈ సీజన్ నుంచే రైతుబంధు  
  • యాదవులందరికీ గొర్రెలు  పంపిణీ చేస్తామని వెల్లడి 


నిర్మల్, వెలుగు:    ‘‘ధరణి పోర్టల్ ను బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ చెప్తున్నది. ఆ పార్టీనే బంగాళాఖాతంలో కలిపేద్దాం’’ అని  సీఎం కేసీఆర్ అన్నారు. రెవెన్యూ శాఖలో సమస్యలను, భూ అక్రమాలను శాశ్వతంగా అరికట్టేందుకు తాము ధరణి పోర్టల్ ను తెస్తే.. దీనిపై కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తోందన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా కొత్త కలెక్టరేట్ ను, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును కేసీఆర్ ప్రారంభించారు. 

అనంతరం ఎల్లపల్లిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షాలు మళ్లీ అధికారంలోకి వచ్చి అంతా మింగుదామని చూస్తున్నాయని విమర్శించారు. ‘రైతుబంధుకు రామ్ రామ్, దళితబంధుకు జై భీమ్ అనే వారు మనకు అవసరమా?’ అని ప్రశ్నించారు. ధరణితోనే రైతులకు రైతుబంధు, రైతు బీమా పథకాలు సక్రమంగా అందుతున్నాయన్నారు. మహారాష్ట్ర సైతం ధరణి అమలును పరిశీలిస్తోందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతో బాగుందని చెప్పారు. ఈ నెల 24 నుంచి పోడు భూముల పట్టాలు పంపిణీ చేస్తామని, ఇదే సీజన్ నుండి పోడు భూముల పట్టాదారులందరికీ రైతుబంధును అమలు చేస్తామన్నారు. యాబై ఏండ్లకు పైగా రాష్ట్రాన్ని పాలించి తాగునీరును కూడా ఇవ్వలేని పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు. ప్రతి తాలూకా కేంద్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తామన్నారు. ఒకప్పుడు కరెంట్ వినియోగం, తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉందన్నారు. యాదవ  సోదరులందరికీ గొర్రెల పంపిణీ పథకాన్ని అమలుచేస్తామన్నారు. ఈ నెల 8న ప్రతి గ్రామంలో చెరువుల పండుగలను జరుపుకోవాలని  పిలుపునిచ్చారు. 

నిర్మల్ జిల్లాకు వరాలు..   

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. నిర్మల్ జిల్లాలోని 396 గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున, 19 మండల కేంద్రాలకు 20 లక్షల చొప్పున, నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీలకు  రూ.25 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. బహిరంగ సభలో ఆర్ అండ్ బీ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్ పర్సన్లు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.