
- బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి
వికారాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉన్నది దగాకోరు సర్కారని, సీమాంధ్రులకంటే భయంకరమైన దోపిడీదారు కేసీఆరేనని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 12 వేల మంది ఉద్యోగులకు సరిపడే వసతి ఉన్న సెక్రటేరియట్ను కూల్చి.. రూ.400 కోట్ల అంచనాలతో పనులు మొదలుపెట్టి రూ.1,200 కోట్లకు అంచనాలు పెంచి దోచుకుంటున్నారని ఆరోపించారు. వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తల శిక్షణ శిబిరంలో వివేక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇండ్ల నిర్మాణాలు సజావుగా సాగుతున్నాయని, రాష్ట్రంలో మాత్రం డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో కేంద్రం ఇచ్చే వాటాను దారి మళ్లించి దోచుకున్నారని, పెంకుటిండ్లలో పూరిగుడిసెల్లో ప్రశాంతంగా బతుకుతున్న పేదల ఇండ్లను కూల్చిన ఘనుడు కేసీఆర్ అని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో నేరుగా పేదలకు ఇండ్లను మంజూరు చేసేలా చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో అమలు చేసి ఉంటే.. ఆయుష్మాన్ భారత్ కింద ఒక్కో రోగికి రూ.5 లక్షల ఖర్చు ఉండేది కాదని, సీఎం నియంత పోకడలే ప్రజల పాలిట శాపాలయ్యాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులపై ప్రజలకు నమ్మకం పోయిందని, కాంగ్రెస్ వారిని గెలిపించిఈనా టీఆర్ఎస్ పార్టీలో కలుస్తారని ఫిక్స్ అయ్యారని చెప్పారు. అదే బీజేపీకి నలుగురు ఎమ్మెల్యేలే ఉన్నా.. 80 మంది ఎమ్మెల్యేలున్నా పార్టీ మారరని జనం నమ్ముతున్నారని తెలిపారు.
ప్రాజెక్టుల రీడిజైన్ల పేరుతో లక్ష కోట్ల దోపిడీ
ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో సీఎం కేసీఆర్ దేశంలోనే అతి పెద్ద కుంభకోణానికి పాల్పడ్డాడని వివేక్ అన్నారు. కాళేశ్వరం.. పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ ల రీడిజైన్ పేరుతో 1లక్షా 25 వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. మిషన్భగీరథ దేశంలోని చాలా రాష్ట్రాల్లో జల్ యోజన స్కీం పేరుతో అమలు చేస్తున్నారని, కానీ తెలంగాణలో చేసినంత విపరీతమైన ఖర్చు ఏ రాష్ట్రంలో లేదన్నారు. ఇన్ని వేల కోట్లు ఖర్చు చేసినా రాష్ట్రంలో చాలా చోట్ల తాగునీరు రాక జనం చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ సోషల్ మీడియా అధ్యక్షుడు వినోద్, వేణుగోపాల్, సదానంద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర సర్కారే రైతులను ముంచింది
టీఆర్ఎస్ ప్రభుత్వం పనితనం ఒక్క గాలి వానకు తేటతెల్లమైంది. అన్నిట్ల మేమే నంబర్ వన్ అని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్, కేటీఆర్ రైతులను, తెలంగాణ ప్రజలను పట్టించుకోవటం లేదు. రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తదని చెప్పి ఇరవై రోజులైనా.. సగం కేంద్రాలు కూడా తెరవకపోవటంతో రైతులు భారీగా నష్టపోయారు. తడిసిన వడ్లను మద్దతు ధరకు ప్రభుత్వమే కొనాలి. మున్సిపల్ మంత్రి హైదరాబాద్ రోడ్ల మీదికి వచ్చి చూస్తే జనం బాధలు అర్థమయ్యేవి. గతంలో వచ్చిన వర్షాలకు సిటీ మొత్తం అల్లకల్లోలమైనప్పుడే పట్టించుకొని ఉంటే..
ఇప్పుడు ఆ పరిస్థితి రిపీట్ అయ్యేది కాదు.