భవిష్యత్​లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోండి: కేసీఆర్

భవిష్యత్​లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోండి: కేసీఆర్
  • ప్రమాదం హృదయ విదారకం: కేటీఆర్​
  • ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ప్రమాదం: హరీశ్​

హైదరాబాద్​, వెలుగు: గుల్జార్​ హౌస్​ అగ్నిప్రమాద ఘటనపై మాజీ సీఎం, బీఆర్ఎస్​అధినేత కేసీఆర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 17 మంది మృతి చెందడం మనసును కలచివేసిందని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స​అందించాలన్నారు.

మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేసి అండగా నిలవాలని ప్రభుత్వాన్ని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరణించిన వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. 

బాధితులు  త్వరగా కోలుకోవాలి: కేటీఆర్

గుల్జార్​ హౌస్​ ప్రమాదం హృదయవిదారకమని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాదంపై లోతుగా విచారణ జరిపించాలన్నారు. ఓల్డ్​సిటీతో పాటు హైదరాబాద్​ సిటీలో అగ్ని భద్రతా చర్యలను బలోపేతం చేయాలని, అగ్నిమాపక సామర్థ్యాన్ని పెంచాలని సూచిస్తున్నామని చెప్పారు. 

ముందస్తు వ్యూహం అమలు చేయలే: హరీశ్

అగ్నిప్రమాదంలో సామాన్యులు మృతి చెందడం బాధను కలిగించిందని హరీశ్​రావు అన్నారు. వరుస అగ్నిప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నదన్నారు. ఎండాకాలంలో అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు వ్యూహం అమలు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని విమర్శించారు. ప్రభుత్వ అలసత్వానికి ఏ పాపం ఎరుగని సామాన్యులు సమిధలవుతున్నారన్నారు. గుల్జార్​ హౌస్​ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు వెంటనే రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్​ చేశారు.