
కేసీఆర్ అంటే కల్వకుంట్ల కమీషన్ రావు అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి విమర్శించారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందన్నారు. సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామంలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి మద్ధతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను 5 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని మండిపడ్డారు.
కేసీఆర్ తన ఆస్తులు పెంచుకున్నాడు తప్ప.. ప్రజలకు చేసిందేమీ లేదని వివేక్ అన్నారు. మునుగోడులో ప్రచారం చేస్తున్న 86 మంది టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వాళ్ళ సొంత నియోజకవర్గాలలో ఇచ్చిన హామీలను అమలు చేశారా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాలను పట్టించుకోకుండా మునుగోడులో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.