
- ప్రత్యేకంగా ఏర్పాటు చేయించిన మంత్రి శ్రీనివాస్గౌడ్
- ఆ రెండింటినీ ప్రారంభించిన మంత్రి కేటీఆర్
మహబూబ్నగర్, వెలుగు: ఒక పక్క ‘కేసీఆర్ పార్క్’.. మరో పక్క ‘కేటీఆర్ నగర్’.. ఇదీ పాలమూరులో రాత్రికి రాత్రి వెలసిన బోర్డులు. వీటిని రాష్ట్ర ఆబ్కారీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయించారు. ఊహించని ఈ పరిణామానికి సాధారణ జనమే కాదు ఆఫీసర్లు, టీఆర్ఎస్ నేతలు కూడా షాక్ తిన్నారు. తన తండ్రి పేరిట ఉన్న ‘కేసీఆర్ ఎకో అర్బన్ పార్కు’ను, తన పేరిట ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్ల కాలనీని సోమవారం మున్సిపల్ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్గౌడ్, ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ సమీపంలోని మయూరి నర్సరీని నాలుగు సంవత్సరాల కింద మయూరి పార్కుగా మార్చారు. దీనిని రూ. 80 కోట్లతో 232 ఎకరాల్లో ‘మయూరి ఎకో అర్బన్ పార్కు’గా తీర్చిదిద్దుతున్నారు. తాజాగా మహబూబ్నగర్, హన్వాడ, నవాబుపేట, జడ్చర్ల మండలాల సరిహద్దుల్లోని రిజర్వ్ ఫారెస్ట్ భూములన్నింటినీ కలుపుకొని 2,087 ఎకరాల్లో డెవలప్చేయాలని భావించారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ ఈ ఎకో పార్కు పేరును ‘కేసీఆర్ అర్బన్ ఎకో పార్కు’గా మార్పు చేయించారు. ఆదివారం ఉదయం పర్యటించిన కలెక్టర్, ఇతర ఆఫీసర్లకు కూడా తెలియకుండా రాత్రికి రాత్రే బోర్డు పెట్టించినట్లు స్థానికంగా చర్చ నడుస్తోంది.మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని వీరన్నపేట సమీపంలో రూ. 40 కోట్లతో నిర్మించిన 660 డబుల్బెడ్ రూం ఇండ్లకు ‘కేటీఆర్ నగర్’ గా పేరుపెట్టడం కూడా అదే రీతిగా జరిగిందన్న చర్చ సాగుతోంది.
ఇండ్ల కోసం మంత్రులకు నిరసన సెగ
అర్హులైన తమకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించలేదని ఆరోపిస్తూ కొందరు.. మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్, ఈటల రాజేందర్ కాన్వాయ్కు అడ్డుతగిలారు. తమ భూములను టీఆర్ఎస్ నేతలుతమ భూములను కబ్జా చేశారని ఆరోపిస్తూ ఇంకొందరు బాధితులు రోడ్డుకు అడ్డంగా పడుకొని ఆందోళన చేశారు. పోలీసులు క్షణాల్లో వారిని పక్కకు పడేశారు. డబుల్బెడ్ రూం ఇండ్ల ఓపెనింగ్కు తనను ఆహ్వానించలేదని స్థానిక బీజేపీ కౌన్సిలర్ అంజయ్య నిరసన వ్యక్తం చేశారు.
కరోనా కేసుల్లో తిరకాసు..వేల కేసులు దాస్తున్న సర్కార్