హైదరాబాద్లో మరిన్ని ప్రాంతాలకు మెట్రోను విస్తరిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. బీహెచ్ఈల్ తో పాటు..నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకు మెట్రోను విస్తరిస్తామని తెలిపారు. భవిష్యత్లో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రోను విస్తరిస్తామని కేసీఆర్ ప్రకటించారు. కేంద్ర సహకారం ఉన్నా..లేకపోయినా..హైదరాబాద్లో మెట్రోను విస్తరిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్లో నివసించే ప్రజల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని..అందుకు అనుగుణగా మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
హైదరాబాద్లో మెట్రో రైల్ లో రోజూ 4.5 లక్షల మంది ప్రయాణిస్తున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. ఎయిర్ పోర్టు మెట్రో వస్తే మరో 70 వేల మంది ప్రయాణిస్తారని చెప్పారు. రూ. 6250 కోట్లతో 31 కిలో మీటర్ల ఎక్స్ ప్రెస్ మెట్రోను నిర్మించనున్నట్లు తెలిపారు. కాలుష్యం, రద్దీని తగ్గించేందుకే మెట్రోను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. వందకు వంద శాతం రాష్ట్ర ప్రభుత్వం, హెచ్ఎండీఏ, జీఎంఆర్ నిధులతో ప్రారంభం చేసుకున్నామని తెలిపారు.