కేసీఆర్.. రాష్ట్రానికి పట్టిన శని : సంజయ్

కేసీఆర్.. రాష్ట్రానికి పట్టిన శని : సంజయ్
  •  కామెడీ ఉంటుందనే జనం ఆయన ఇంటర్వ్యూలు చూస్తున్నరు 

మానకొండూరు, వెలుగు: కేసీఆర్ తెలంగాణ ఆత్మ కాదని, తెలంగాణకు పట్టిన శని అని కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా సిగ్గు రాలేదని మండిపడ్డారు. ‘‘అధికారంలో ఉన్నన్నాళ్లు ప్రజలను రాచి రంపాన పెట్టినవ్. ఉద్యోగాలడిగితే నిరుద్యోగులపై లాఠీ చార్జ్​ చేయించి జైల్లో పెట్టించినవ్. పేపర్ లీకేజీలతో 30 లక్షల మంది నిరుద్యోగులను రోడ్డున పడేసినవ్. రైతులు వడ్ల కల్లాలపై గుండె పగిలి చస్తున్నా చూసినవ్.. వానలతో పంట నష్టపోతే పైసా ఇవ్వకుండా.. మద్యాన్ని ఏరులై పారించి మహిళల పుస్తెల తాడు తెంచినవ్.. నువ్వు తెలంగాణ ఆత్మవా?’’ అని సంజయ్ ప్రశ్నించారు. 

శుక్రవారం బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మానుకొండూరులో నిర్వహించిన దళిత సమ్మేళనం కార్యక్రమంలో ఆయన ​పాల్గొని మాట్లాడారు. తెలంగాణను దోచుకున్న ఆంధ్రా పాలకులను తరిమికొట్టామని, ఇప్పుడు బీఆర్ఎస్ ను పాతరేసే టైమొచ్చిందన్నారు. జూన్ 4న ఆ పార్టీని పాతరేసేందుకు ప్రజలు సిద్ధమయ్యారని తెలిపారు. ఐఎన్ సీ అంటే ‘ఇటలీ నేషనల్ కాంగ్రెస్’ అని సంజయ్​ఎద్దేవా చేశారు. 

57 ఏండ్లు దేశాన్ని పాలించిన పార్టీ ఏనాడూ దళితుల అభ్యున్నతికి పనిచేయలేదని విమర్శించారు. అంబేద్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు కూడా హాజరుకాని అహంకారి కేసీఆర్ అని విమర్శించారు. పేరులోనే భారతీయతను సంతరించుకున్న పార్టీ బీజేపీ అని అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని తప్పకుండా అమలు చేస్తుందని, రాజ్యాంగాన్ని మారుస్తామని ఏ ఫాల్తుగాడు అన్నా సహించేది లేదన్నారు. కేసీఆర్ కరీంనగర్​కు వచ్చి తనను ఓడగొట్టడానికి కుట్ర చేస్తున్నారన్నారు. కేసీఆర్ ప్రెస్ మీట్​లో మాట్లాడితే జబర్దస్త్ కంటే ఫుల్ కామెడీ ఉంటుందనే జనం చూస్తున్నారని ఎద్దేవా చేశారు.