
ప్రజల సొమ్ము దోచుకుని ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పెట్టిన కవితను అరెస్టు చేయాలని మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ డిమాండ్ చేశారు. రాక్షసుల్లాంటి కేసీఆర్ ఫ్యామిలీపై అందరు కలిసికట్టుగా పోరాడాలన్నారు. ఐదారు నెలల్లోనే కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తాడన్నారు. కేసీఆర్ తన తోక చుట్టాలను మాత్రమే అభివృద్ధి చేస్తున్నాడని.. రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు.
బీజేపీ అధికారంలోకి వస్తే మహిళలకు నామినేటెడ్ పోస్టులొస్తాయని శోభ అన్నారు. హైదరాబాద్ పబ్బుల్లో విచ్చలవిడిగా డ్రగ్స్ సరాఫరా జరుగుతోందని ఆరోపించారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై మహిళా మోర్చా ఉద్యమించాలని సూచించారు. మహిళా రిజర్వేషన్లను అడ్డుపెట్టుకుని పురుషులు.. భార్యనో, చెల్లెనో నిలబెట్టడాన్ని వ్యతిరేకించాలన్నారు. బీజేపీ కోసం ఫుల్ టైం పనిచేసిన మహిళలకే అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాజకీయంగా మహిళలు ఎదగాలని శోభ పిలపునిచ్చారు. చట్టసభల్లో 33 శాతమే మహిళలు ఉండటాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. మహిళలు అభ్యున్నతికి అంబేద్కర్, జ్యోతిరావ్ పూలే ఎంతో శ్రమించారని చెప్పారు. ఈ ఇద్దరు లేకుంటే మహిళలు ఇంటినుంచి బయటకు వచ్చేవారు కాదన్నారు.