- ఈడీకి కేసీఆర్ అన్న కూతురు రమ్యారావు ఫిర్యాదు
- అక్రమంగా మైనింగ్, ఇసుక క్వారీలు నిర్వహిస్తున్నారని ఆరోపణ
- మైనింగ్ వ్యాపారి ప్రదీప్రెడ్డి సహా ముగ్గురిపై కంప్లయింట్
హైదరాబాద్, వెలుగు: రాజ్యసభ మాజీ సభ్యుడు జోగినపల్లి సంతోష్రావు ఆస్తులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు చేయాలని మాజీ సీఎం కేసీఆర్ అన్న కూతురు, కాంగ్రెన్ నేత రమ్యారావు డిమాండ్ చేశారు. సంతోష్రావుతో పాటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడు శ్రీనివాస్ రావు, మైనింగ్ వ్యాపారి ప్రదీప్ రెడ్డి అక్రమంగా క్వారీలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. అక్రమ మైనింగ్ తో వచ్చిన డబ్బును ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పెట్టినట్లు వెల్లడించారు.
మైనింగ్ వ్యాపారి జోరేపల్లి ప్రదీప్రెడ్డి అక్రమ క్వారీల వెనుక సంతోష్రావు, శ్రీనివాస్ రావు ఉన్నారని ఆరోపించారు. ప్రదీప్ రెడ్డి తండ్రి మృతి అనంతరం ఆయన పేరున ఉన్న మైన్స్, క్వారీలను అక్రమంగా బదిలీ చేసుకున్నాడని ఆరోపిస్తూ.. ప్రదీప్రెడ్డి తల్లి జోరేపల్లి కృష్ణకుమారి సోమవారం ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. కృష్ణకుమారితో కలిసి రమ్యారావు ఈడీ ఆఫీసుకు వచ్చారు. సంతోష్రావు, శ్రీనివాస్ రావు సహా ప్రదీప్ రెడ్డి అక్రమ క్వారీలు నిర్వహిస్తున్నారని ఈడీకి తెలిపారు.
అనంతరం రమ్యారావు మీడియాతో మాట్లాడారు.. హోటల్లో సర్వర్లుగా పనిచేసిన వారికి వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. మిడ్ మానేరు నిర్వాసితుల లిస్ట్లో జోగినిపల్లి సంతోష్ పేరు కూడా ఉందన్నారు. బీసీగా పేరు చెప్పుకుని లబ్ధి పొందారని తెలిపారు. మిడ్ మానేరు నిర్వాసితుల పేరుతో సంతోష్రావు కుటుంబం అనేక ప్లాట్లు తీసుకున్నదని ఆరోపించారు.
ప్రభుత్వం మారినా దందాలు ఆగట్లే..
సంతోష్ రావు సహా ముగ్గురు 2013 నుంచి అక్రమంగా క్వారీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రదీప్ రెడ్డి బోగస్ పత్రాలను తయారు చేసి మోసాలకు పాల్పతున్నాడన్నారు. ప్రభుత్వం ఎవరిదైనా భూదందాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయన్నారు. అన్ని శాఖలను వాళ్లు మ్యానేజ్ చేస్తున్నారని ఆరోపించారు.
