న్యూఢిల్లీ : ఢిల్లీ జల్ బోర్డులో అక్రమాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు కేజ్రీవాల్ సోమవారం హాజరుకాలేదు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులోనూ ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ కేసులోనూ విచారణకు రావాలంటూ ఈడీ ఇచ్చిన నోటీసులను దాటవేస్తూ వస్తున్నారు. అలా ఇప్పటివరకు ఈడీ నుంచి 8 సార్లు సమన్లు వచ్చినప్పటికీ విచారణకు పోలేదు.
ఈ నెల 21న హాజరుకావాల్సిందేనంటూ అధికారులు తొమ్మిదోసారి ఢిల్లీ సీఎంకు సమన్లు జారీ చేశారు. ఇవి చట్టవిరుద్ధం అంటూ ఆప్ సర్కారు చేసిన సవాల్పై విచారణ కోర్టులో కొనసాగుతోంది. అయితే, కేంద్రంలోని బీజేపీ సర్కారు కావాలనే కేజ్రీవాల్ను టార్గెట్ చేస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది.
కేజ్రీవాల్ లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా అడ్డుకునేందుకు ఈడీని వాడుకుంటోందని ఆరోపించింది. ఈడీ అధికారులు బీజేపీ ఎజెండాను అమలు చేయడం ఎప్పుడు ఆపేస్తారో అర్థంకావట్లేదని ఆ పార్టీ నేత గోపాల్ రాయ్ మండిపడ్డారు.