
ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలో ఘోర పాపానికి ఒడిగట్టారు దుర్మార్గులు. ఏకంగా అయ్యప్ప స్వామివారి బంగారాన్నే రహస్యంగా మాయం చేశారు. గ్రాములు కాదు తులాలు కాదు.. ఏకంగా కేజీల్లోనే బంగారాన్ని నొక్కేశారు. ఆలయంలో 4.5 కిలోల బంగారం మాయం కావడం సంచలనంగా మారింది. రూ.5 కోట్లకు పైనే ఉండే మాయం అవ్వడంపై కేరళ హైకోర్టు తీవ్రంగా స్పందించి విచారణకు ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో ట్రావెన్కోర్ దేవస్వమ్ బోర్డు (టీడీబీ) అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
2019లో ద్వారపాలకుల విగ్రహాలకు కొత్తగా బంగారు తాపడం చేయించేందుకు పాత రాగి రేకులను తొలగించారు. ఆ సమయంలో వాటి బరువు 42.8 కిలోలుగా నమోదైంది. అయితే, పనుల నిమిత్తం చెన్నైలోని ఓ సంస్థకు వాటిని అప్పగించేసరికి బరువు 38.258 కిలోలకు పడిపోయింది. ఈ రెండు లెక్కల మధ్య దాదాపు 4.54 కిలోల తేడా ఉండటంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దాదాపు 5 కోట్ల విలువైన బంగారం మాయం కావడంపై సమగ్ర విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ సందర్భంగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇది చాలా తీవ్రమైన అంశం. దీనిపై కచ్చితంగా లోతైన విచారణ జరగాలి అని జస్టిస్ రాజా విజయరాఘవన్, జస్టిస్ కేవీ జయకుమార్లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.
వాస్తవానికి ఈ ద్వారపాలకుల విగ్రహాలను 1999లో 40 ఏళ్ల వారంటీతో తయారు చేశారు. అయినప్పటికీ, కేవలం ఆరేళ్లకే తాపడంలో లోపాలు తలెత్తడంతో మరమ్మతులు చేపట్టాల్సి వచ్చింది.
ఈ వివాదం 2019లో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు చేపట్టిన పనులతో మొదలైంది. స్పెషల్ కమిషనర్కు గానీ, కోర్టుకు గానీ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే బంగారు రేకులను తొలగించారు అధికారులు. ఎలాంటి భద్రత లేకుండా ఓ భక్తుడి ద్వారా వాటిని చెన్నైకి పంపడం కూడా వివాదానికి దారితీసింది. ప్రస్తుతం హైకోర్టు ఆదేశాలతో ఈ కేసు విజిలెన్స్ పరిధిలోకి వెళ్లడంతో, విచారణలో అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు.