కేరళను ముంచెత్తిన వాన...వందల ఇండ్లు నేలమట్టం

కేరళను ముంచెత్తిన వాన...వందల ఇండ్లు నేలమట్టం
  • 8 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ ..మరో 5 రోజులు భారీ వానలు

తిరువనంతపురం: కేరళలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న భీకర వానలకు రాష్ట్రవ్యాప్తంగా వందల ఇండ్లు కూలిపోయాయి. మరికొన్ని పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. శుక్రవారం కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. చాలా చోట్ల చెట్లు కూలిపోయాయి. విద్యుత్  సరఫరా బంద్  అయింది. రోడ్లపై వర్షపు నీరు నిలిచింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. 

పథనంతిట్ట, అళప్పుజ, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిస్సూర్, కన్నూర్, కాసర్​గోడ్  జిల్లాలకు ఐఎండీ రెడ్  అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇష్యూ చేసింది. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ మంత్రి కె.రాజన్ చెప్పారు. 

‘‘డేంజర్  జోన్లలో నివసిస్తున్న వారు సురక్షిత ప్రాంతాలకు లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిలీఫ్​ క్యాంపులకు వెళ్లిపోవాలి. ప్రస్తుతం 66 క్యాంపులు ఏర్పాటు చేశాం. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని 4 వేల క్యాంపులు ఓపెన్  చేస్తాం. వాటిలో దాదాపు 6 లక్షల మంది ఆశ్రయం తీసుకోవచ్చు. క్యాంపులకు వెళ్లే విషయంలో ప్రజలు దయచేసి సంకోచించవద్దు” అని మంత్రి పేర్కొన్నారు.

మత్స్యకారులు వేటకు వెళ్లవద్దు

తీర ప్రాంతాల్లో నివసిస్తున్న వారు జాగ్రత్తగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఇండియన్  నేషనల్  సెంటర్  ఫర్  ఓషియన్  ఇన్ఫర్మేషన్  సర్వీసెస్ (ఇన్ కాయిస్) హెచ్చరించింది. వచ్చే 24 గంటల్లో సముద్రంలో అలలు 3 నుంచి 3.9 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడతాయని తెలిపింది. 

మణిపూర్ లో కుండపోత

మణిపూర్​లో రెండు రోజులుగా వర్షం కుండపోతగా కురుస్తోంది. దీంతో రాజధాని ఇంఫాల్ జలమయంగా మారింది. రోడ్లపై వరద చేరడంతో జనజీవనం స్తంభించిపోయింది. ఇంఫాల్, సెరౌ నదితో పాటు పలు నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. కాగా, మహారాష్ట్రలోని లాతూర్ లో గత 25 ఏండ్లలో అత్యధిక వర్షపాతం రికార్డయింది. ఈ నెలలో 46.9 సెం.మీ. రెయిన్ ఫాల్ నమోదైందని అధికారులు తెలిపారు.