
హైదరాబాద్, వెలుగు: ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడమీ స్కూల్ (ఎంఎస్డీసీఏ) ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ ట్రోఫీని ధోనీ తొలి కోచ్ కేశవ్ బెనర్జీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (నాచారం)లో మంగళవారం జరిగింది. ఈ లీగ్లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. హైదరాబాద్ శివారులోని గండిపేటలో మ్యాచ్లు జరుగుతాయని టోర్నీ ఆర్గనైజర్ 7హెచ్ స్పోర్ట్స్ డైరెక్టర్ బి.వెంకటేష్ తెలిపారు.
షెడ్యూల్ ప్రకారం మ్యాచ్లు గురువారం నుంచి జరగాల్సి ఉండగా, భారీ వర్షాల కారణంగా రీషెడ్యూల్ చేశామన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టాక పూర్తి షెడ్యూల్ను విడుదల చేస్తామని ప్రకటించారు. ఇక, లీగ్లో గుర్తించిన 10 మంది టాలెంటెడ్ క్రికెటర్లకు పల్లవి ఫౌండేషన్ ద్వారా రూ.5 లక్షల స్కాలర్షిప్, ఎంఎస్డీసీఏలో ఆరు నెలల పాటు ఉచిత క్రికెట్ కోచింగ్ ఇస్తామని స్కూల్స్ సీఓఓ మల్కా యశస్వి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్డీసీఏ మార్కెటింగ్ డైరెక్టర్ రషీద్ బాషా, డీపీఎస్, పల్లవి, ఎంఎస్డీసీఏ సిబ్బంది పాల్గొన్నారు.