చంద్రబాబు ఏపీకి పనికిరాని వ్యక్తి: కేశినేని నాని

చంద్రబాబు ఏపీకి పనికిరాని వ్యక్తి: కేశినేని నాని

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మోసగాడని ప్రపంచానికి తెలుసని..  కానీ, ఇంత పచ్చి మోసగాడు, దగా చేస్తాడని తనకు తెలియదన్నారు. ఇటీవల కేశినేని నాని టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జనవరి 10వ తేదీ బుధవారం నాని.. సీఎం జగన్ ను కలిసి వైసీపీలో చేరారు. 

అనంతరం మీడియాతో కేశినేని నాని మాట్లాడుతూ.. "టీడీపీ కోసం చాలా కష్టపడ్డా. టీడీపీ కోసం నా సొంత వ్యాపారాలను పక్కనపెట్టాను. వాటికన్నా పార్టీనే ముఖ్యమనుకున్నా. టీడీపీ కోసం సమయం, డబ్బు వృథా చేసుకోవద్దని నాకు చాలా మంది చెప్పారు.. కానీ, నేను ఎవరి మాటలు వినకుండా పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేశా. నాకుటుంబంలో చిచ్చు పెట్టారు. నన్ను చాలా రకాలుగా అవమానించారు.  నన్ను గొట్టంగాడు అన్నా.. భరించా. చంద్రబాబు పాదయాత్ర, స్థానిక సంస్థల ఎన్నికలను నా భుజంపై మోశా. నన్ను చెప్పు తీసుకుని కొడతానని ఓ క్యారెక్టర్ లెస్ వ్యక్తి తిట్టినా పార్టీ  స్పందించలేదు. నా కుటుంబ సభ్యులతో కొట్టించాలని లోకేష్ ఎందుకు చూశాడు. ఇష్టం లేకపోతే వెళ్లిపోతానని చంద్రబాబుకు అప్పుడే చెప్పా.. కానీ, ఆయన వెళ్లొద్దని..  నువ్వు ఇండాల్సిందేనని చెప్పారు.  ఎంపీగా.. సీఎం కార్యక్రమాలకు అటెండ్ అవ్వాలి.. అది ప్రోటోకాల్, కానీ చంద్రబాబు.. నన్ను హాజరుకానివ్వలేదు. విజయవాడ ఒక రియాలిటీ.. అమరావతి ఓ కల. 2014-2019వరకు విజయవాడ కోసం చంద్రబాబు రూ.100 కోట్లైనా ఇచ్చాడా?. విజయవాడ అంటే నాకు ప్రాణం.. ఏమైనా చేస్తా. ఇప్పుడు జగన్ తో ప్రయాణం చేద్దామనుకుంటున్నా. నేను అప్పట్లో బాబును టికెట్ అడగలేదు.. ఇప్పుడు జగన్ ను టికెట్ అడగలేదు" అని చెప్పారు.