టీటీడీ ఆస్తులపై శ్వేత పత్రం విడుదల 

టీటీడీ ఆస్తులపై శ్వేత పత్రం విడుదల 
  • టీటీడీ పాలక మండలి‌ సమావేశంలో ‌కీలక నిర్ణయాలు
  • భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులపై శ్వేత పత్రం విడుదల చేశారు. 960 స్థిర ఆస్తుల విలువ రూ 85 వేల 705 కోట్లు ఉంటుందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి  ప్రకటించారు. ఇవాళ తిరుమలలోని అన్నమయ్య భవన్ లో జరిగిన పాలక మండలి‌ సమావేశంలో పలు‌కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ  బ్రహ్మోత్సవాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కరోనా కారణంగా రెండేళ్ల తరువాత భక్తుల సమక్షంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. టీటీడీకి సంబంధించి.. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన 12 రకాల పంటలను కొనుగోలు చేసేందుకు రైతు సాధికార సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని వివరించారు. 

తిరుమలలో సామాన్య భక్తులకు వసతి సదుపాయాల పెంపు

తిరుమలలో సామన్య భక్తులకు వసతి సదుపాయాలు పెంచడంపై పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. గోవర్థన సత్రాల వెనుక భాగంలో 95 కోట్లతో పీఏసి-5 నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాంమని, వకూళమాత ఆలయం నుండి జూపార్క్ వరకు 30 కోట్లతో కనెక్టివిటీ రింగ్ రోడ్డును నిర్మించాలని నిర్ణయించామని చెప్పారు. తిరుమలలోని గదుల్లో గీజర్ లు ఏర్పాటుకు రూ 7 కోట్ల 20 లక్షల నిధులు మంజూరు చేసేందుకు చర్చించి నిర్ణయించుకున్నామని, ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో క్లాస్ రూమ్స్, హాస్టల్ అభివృద్ధికి 6 కోట్లు 20 లక్షల నిధులు మంజూరు చేశామన్నారు. అలాగే టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాల కోసం 300 ఎకరాలు ప్రభుత్వం నుండి ఇదివరకే కొనుగోలు చేశామని, భవిష్యత్తు అవసరాల కోసం 25 కోట్లతో మరో 130 ఎకరాలు కొనుగోలు చేయాలని తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. 

ఉదయం 10 గంటల తర్వాత వీఐపీ బ్రేక్ దర్శనాలు

వీఐపీ బ్రేక్ దర్శనాల సమయంలో మార్పులు చేయాలని టీటీడీ పాలక మండలి సమావేశంలో నిర్ణయించారు. ఉదయం 10 గంటల తరువాత వీఐపీ బ్రేక్  దర్శనాలు ప్రారంభించాలని యోచిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. పూర్తి స్ధాయిలో బ్రేక్ దర్శనాలను ప్రయోగాత్మకంగా పరిశీలించిన తరువాత అమలు చేస్తామని ఆయన చెప్పారు. అలాగే టైం స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ పునరుద్ధరించాలని నిర్ణయించామని.. పెరటాసి మాసం అనంతరం తిరుపతిలో సర్వదర్శనం టోకన్లు జారీ  పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

ఎలాంటి టోకన్లు, టిక్కెట్లు లేక పోయినా భక్తులను సర్వదర్శనానికి అనుమతించే విధానం యధావిధిగా కొనసాగుతుందన్నారు. వసతి కేటాయింపు ప్రక్రియను పూర్తిగా తిరుపతి నగరానికి మార్పు చేయాలనే యోచనలో ఉన్నామని, బ్రహ్మోత్సవాల అనంతరం ప్రయోగాత్మకంగా పరిశీలించిన తర్వాతే గదులు కరెంట్ బుకింగ్ విధానం తిరుపతికి తరలించడంపై నిర్ణయం తీసుకుంటామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరించారు.