
హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. గురువారం (జూలై 10) సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో కేబినెట్ భేటీ జరిగింది. దాదాపు ఐదు గంటల పాటు జరిగిన ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలు, ఇతర అంశాలపై మంత్రి మండలి సుదీర్ఘంగా చర్చించింది. స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకు 2018 పంచాయత్ రాజ్ చట్ట సవరణ చేసి ఆర్డినెన్స్ జార చేసేందుకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనితో పాటు పలు కీలక నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది.
కేబినెట్ భేటీ నిర్ణయాలు:
- స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు
- బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక ఎన్నికలు
- 2018 పంచాయత్ రాజ్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ జారీకి గ్రీన్ సిగ్నల్
- సెయింట్ మేరీ, అమిటీ విద్యాసంస్థలకు యూనివర్సిటీ హోదా
- గోశాలల పాలసీలో మార్పులు చేయాలని నిర్ణయం
- రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని నిర్ణయం