ఓల్డ్ సిటీ మెట్రో పనులపై కీలక అప్డేట్

 ఓల్డ్ సిటీ మెట్రో పనులపై కీలక అప్డేట్

హైదరాబాద్ ఓల్డ్ సిటీ మెట్రో రైల్ విస్తరణకు సంబంధించిన కీలక అప్ డేట్ ఇచ్చారు  హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్, హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ (HMRL) అదనపు ఎండీ అజిత్ రెడ్డి. 2026 ఆగస్టు 29న ఓల్డ్ సిటీ మెట్రోరైల్ పనులను పరిశీలించిన ఆయన..  అన్ని ప్రభుత్వ శాఖలు తమ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.  

 దారుష్షిఫా నుండి చాంద్రాయణ గుట్ట వరకు 7.5 కిలోమీటర్ల పరిధిలో జరుగుతున్న రోడ్ విస్తరణ పనులను మెట్రో రైల్ చీఫ్ ఇంజినీర్ ఎస్.భాస్కర్ రెడ్డి తో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు.  ఈ మార్గంలో ప్రభావిత ఆస్తులు మొత్తం 888 కి గాను, ఇప్పటికే స్వాధీనం చేసుకున్న 833 ఆస్తులను వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిగిలిన 55 ఆస్తులలో ఉన్న వారసత్వ కట్టడాలు, పురాతన భవనాలు వెంబడి మెట్రో రైల్ మార్గం విస్తరణకు చేపడుతున్న చర్యలను కూడా ఈ సందర్బంగా అధికారులతో చర్చించారు. 

ఈ కారిడార్ లో ఉన్న విద్యుత్ తీగలు, స్తంభాలు, వాటర్ వర్క్స్ కి సంబంధించిన పైప్ లు, తదితర యుటిలిటీలు అడ్డంకిగా మారకుండా వాటిని సురక్షితంగా తరలించే పనుల ఇంకా వేగవంతం చేయాలనీ అదనపు ఎండీ అజిత్ రెడ్డి తెలిపారు.  భూసేకరణ పూర్తి అయిన ప్రభావిత ఆస్తుల తొలగింపు త్వరిత గతిన పూర్తి చేయాలనీ  అధికారులను ఆదేశించారు.  

ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణ త్వరగా పూర్తి చేసి ప్రజలకు రవాణా సౌకర్యాలను మెరుగుపరచాల్సిందిగా సీఎం రేవంత్ ఆదేశాల మేరకు స్థానికులు సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు.    మెట్రో పనుల పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తూ తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారని అన్నారు. ఈ కారిడార్ లోని జరిగే మెట్రో పనులతో సంబంధం ఉన్న అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేసి త్వరిత గతిన రైట్ అఫ్ వే (ఆర్ఓడబ్ల్యూ) వచ్చేలా కృషి చేయాలని సూచించారు. 

అనేక సవాళ్ల మధ్య భూసేకరణకు విశేష కృషి చేసిన రెవెన్యూ అధికారులను ఆయన అభినందించారు.  క్షేత్ర పర్యటనలో మెట్రో రైల్ స్పెషల్ ప్రాజెక్ట్ మేనేజర్   సి.వినోద్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్   కే.శ్యామ్ మోహన్ రెడ్డి, డిప్యూటీ సీఈ   టి.రామచంద్రన్, ప్రాజెక్ట్ మేనేజర్   కే.నరసింగ రావు, భూసేకరణ డీజీఎం   వి.ప్రవీణ్ కుమార్, జీహెచ్ఎంసి జోనల్ కమిషనర్  కే.సత్యనారాయణ, మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు, హెచ్ఎంఆర్ఎల్ అధికారులు పాల్గొన్నారు.