అన్నంలో పురుగులు..స్టూడెంట్స్​ ఆందోళన

అన్నంలో పురుగులు..స్టూడెంట్స్​ ఆందోళన

అన్నంలో పురుగులు, రాళ్లు, వెంట్రుకలు వస్తున్నాయని ఆదిలాబాద్​ జిల్లా నేరడిగొండలోని కేజీబీవీ స్టూడెంట్లు ఆందోళనకు దిగారు. స్కూల్​ బిల్డింగ్​ పైకెక్కి నిరసన తెలిపారు. రోజూ పురుగుల అన్నం తింటుండడంతో కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

నేరడిగొండ, వెలుగు : అన్నంలో పురుగులు, రాళ్లు, వెంట్రుకలు వస్తున్నాయని ఆదిలాబాద్​ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ( కేజీబీవీ) స్టూడెంట్లు ఆందోళన చేశారు. పాఠశాల భవనంపైకెక్కి విద్యార్థినులు ధర్నా చేశారు. పురుగుల అన్నం తిని కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలోని వంటమనిషి..‘తింటే తినండి, లేకుంటే పస్తులు ఉండండి’ అంటూ దురుసుగా ప్రవర్తిస్తున్నదన్నారు. ఆ వంటమనిషిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. పురుగుల అన్నం తిని మొత్తం 11 మంది స్టూడెంట్ల అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. వారిని స్థానిక పీహెచ్ సీకి తరలించగా ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్ కి తరలించారని వెల్లడించారు.

స్టూడెంట్ల ఆందోళన విషయం తెలుసుకున్న మండల బీజేపీ నాయకులు అక్కడికి చేరుకుని వారితో మాట్లాడారు. స్టూడెంట్ల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పైఅధికారులకు సమాచారం అందించగా సంబంధిత సిబ్బంది పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తర్వాత స్టూడెంట్లను సముదాయించి ఆందోళనను విరమింపజేశారు.