
ఖలిస్థాన్ కమాండో ఫోర్స్ ఉగ్ర సంస్థకు చెందిన గుర్సేవక్ బాబ్లా (53)ను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిన్న(మంగళవారం) రాత్రి అరెస్టు చేశారు. ఈ విషయంపై ఇవాళ (బుధవారం) పోలీసులు ప్రకటన చేశారు. 50కి పైగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన కేసుల్లో గుర్సేవక్ బాబ్లా భాగస్వామిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. పంజాబ్,ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కొంతమంది పోలీసులు, వారి ఇన్ఫార్మర్లను హత్య చేసిన కేసుల్లో, బ్యాంకులు, పోలీస్ స్టేషన్లపై దాడులు చేసి చోరీలు చేసిన కేసుల్లోనూ నిందితుడుగా ఉన్నాడు. అంతేకాదు భారత ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ బ్లూ స్టార్’లో హతమైన జర్నైల్ సింగ్ భిందెర్వాలాతో గుర్సేవక్ బాబ్లాకు సంబంధాలు ఉన్నాయని తెలిపారు.
‘ఖలిస్థాన్ కమాండో ఫోర్స్’ చీఫ్ పరంజీత్ సింగ్ పంజ్వాడ్ సూచనలతో అతడు తమ ఉగ్ర సంస్థను మళ్లీ పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుపుతున్నాడని పోలీసులు తెలిపారు. భారత్లోని పలు జైళ్లలో ఉన్న కొందరు ఉగ్రవాదులతో సంప్రదింపులు జరపడానికి ప్రయత్నాలు జరుపుతున్నాడని చెప్పారు. పాకిస్తాన్ ఆధారిత ఖలిస్థాన్ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. గుర్సేవక్ బాబ్లా గతంలో రెండు సార్లు ఢిల్లీ, రాజస్థాన్ పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకుని పారిపోయాడని చెప్పారు. అప్పటి నుంచి అతడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.