
- ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం టౌన్, వెలుగు : ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం పెరగాలని, అందుకు మెరుగైన వైద్యం అందించాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి డాక్టర్లకు సూచించారు. డాక్టర్లు, సిబ్బంది తప్పనిసరిగా సమయ పాలన పాటించాలన్నారు. బుధవారం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
డయాలసిస్ వార్డు, ఫార్మసీ స్టోర్, జనరల్ వార్డు, కిచెన్, టాయిలెట్స్ను పరిశీలించారు. రోగులతో మాట్లాడి ఆస్పత్రిలోని సమస్యలు, అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రి ప్రాంగణం, పరిసరాలను శుభ్రంగా ఉంచాలన్నారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూడాలని చెప్పారు.
కిచెన్ విభాగంపై ఫిర్యాదులు రాకుండా సరిగా చేయాలని చెప్పారు. పరీక్షల కిట్ల లభ్యతను అడిగి తెలుసుకున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు ఎటువంటి పరీక్షల కోసం రాయవద్దని చెప్పారు. కలెక్టర్ వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కిరణ్ కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ బి.కిరణ్ కుమార్, ఆర్ఎంవో డాక్టర్ రాంప్రసాద్, డాక్టర్ రాంబాబు, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.
జీరో పర్మిట్ విధానాన్ని పక్కాగా నిర్వర్తించాలి
జిల్లాలో జరిగే ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు నిబంధనల ప్రకారం జీరో పర్మిట్ విధానం పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ అనుదీప్ అధికారులకు సూచించారు. మైనింగ్, వివిధ ఇంజనీరింగ్ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనులకు సరిపోను ఇసుక అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి ఇసుక వివరాలను సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు టీజీఎండీసీకి అందించాలన్నారు.
విపత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి
వరద విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులు సన్నద్ధం కావాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. సీపీ సునీల్ దత్, అడిషనల్ కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి విపత్తుల నిర్వహణపై జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో సమీక్షించారు. గతంలో ముంపునకు గురైన ప్రతి హ్యాబిటేషన్ ఇంటిలో ప్రజలను మరోసారి వరదలు వస్తే ఎక్కడికి తరలిస్తామనే మైక్రో లెవల్ ప్లానింగ్ సిద్దం చేసుకోవాలన్నారు. పునరావాస కేంద్రాల సమాచారం ముందుగానే వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అందించాలని చెప్పారు.
మొక్కల పెంపకంలో ఆదర్శంగా నిలవాలి
చింతకాని : మొక్కలు పెంచడంలో ఖమ్మం జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ అనుదీప్ అధికారులకు సూచించారు. చింతకాని మండలంలో వందనం గ్రామంలోని బుధవారం నర్సరీని సందర్శించి పలు సూచనలు చేశారు. వన మహోత్సవంలో భాగంగా జిల్లాలో ప్రతీ శాఖ, వారికి కేటాయించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటాలని సూచించారు.
గుంతల తవ్వకం పనులు ఉపాధి హామీ పథకం కింద చేపట్టాలన్నారు. ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ చేయాలని, వాటిని నాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం వందనం గ్రామంలోని స్వయంభు శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. డీఆర్డీవో సన్యాసయ్య, చింతకాని ఎంపీడీవో ఉన్నారు.