ప్రైవేటు స్కూళ్లకు దీటుగా సర్కారు బడులు

ప్రైవేటు స్కూళ్లకు దీటుగా  సర్కారు బడులు
  • ఖమ్మం కలెక్టర్​ ముజమ్మిల్​ ఖాన్​ 
  • మూతపడిన పాఠశాలలు మళ్లీ ప్రారంభం 
  • డెవలప్​మెంట్​కు రూ.10 లక్షల చెక్కు ఆర్డీవోకు అందజేత 

కల్లూరు, వెలుగు : ప్రభుత్వ స్కూళ్లలో అన్ని వసతులతోపాటు నాణ్యమైన విద్య అందిస్తున్నామని, సర్కారు బడులపై నమ్మకం పెట్టి పిల్లలను పంపించాలని ఖమ్మం కలెక్టర్​ ముజమ్మిల్​ ఖాన్​ తల్లిదండ్రులకు సూచించారు. కల్లూరు మండలంలోని  ఓబుల్ రావు బంజర గ్రామంలో గతంలో మూతబడిన ప్రాథమిక పాఠశాలను బడిబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం మళ్లీ ప్రారంభించారు.

 ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన విద్య అందించడం తమ బాధ్యతగా ప్రభుత్వం భావిస్తోందని, అందులో భాగంగా ప్రైవేట్​కు దీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దుతోందని తెలిపారు. సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు విద్య ఒకటే మార్గమన్నారు. ఖమ్మం జిల్లాలో 1500 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, వీటిలో మూతబడిన పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పునరుద్ధరణకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. 

గతేడాది 10వ తరగతిలో  ప్రభుత్వ పాఠశాలల్లో 96 శాతం ఉత్తీర్ణత ఉంటే, ప్రైవేట్ పాఠశాలల్లో కేవలం 91 శాతం మాత్రమేనని చెప్పారు.అనంతరం కల్లూరు మండలంలో మూతబడి పునః ప్రారంభించుకున్న పాయాపూర్, లక్ష్మీపురం, ఓబుల్ రావు బంజారా పాఠశాలల రినోవేషన్ కోసం రూ.10 లక్షల చెక్కును కల్లూరు ఆర్డీవోకు కలెక్టర్​ అందజేశారు. పిల్లలకు స్కూల్ యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు, స్పోర్ట్స్ మెటీరియల్ పంపిణీ చేశారు. గ్రామంలోని అంగన్​వాడీ సెంటర్ ను పరిశీలించి పలు సూచనలు చేశారు.

 ఈ కార్యక్రమంలో డీఈవో ఎస్. సత్యనారాయణ, కల్లూరు ఆర్డీవో ఎల్. రాజేందర్ గౌడ్, తహసీల్దార్ పులి సాంబశివుడు ఎంపీడీవో చంద్రశేఖర్, ఎంఈవో పత్తిపాటి నివేదిత, సీడీపీవో  సీహెచ్​ నిర్మలాజ్యోతి తదితరులు పాల్గొన్నారు.

టీచర్ కు అభినందన.. 

ఓబుల్ రావు బంజర నుంచి తిరిగి వస్తున్న క్రమంలో రోడ్డుపై టూ వీలర్ వాహనం ద్వారా ప్రచారం నిర్వహిస్తున్న కల్లూరు మండలం చెన్నూరు గ్రామ ఎంపీపీఎస్ స్కూల్​ హెడ్మాస్టర్​ దంతాలసుధాకర్  ​ను గమనించారు. ఆయనను అభినందించి ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది పిల్లలు చేరేలా చూడాలని కలెక్టర్ సూచించారు. 

మహిళా మార్ట్  విజిట్

ఖమ్మం టౌన్ :  ప్రజల్లో విశ్వాసం పంచేలా న్యాయబద్ధంగా మహిళా సంఘాలు వ్యాపారం నిర్వహించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. ఖమ్మం నగరంలో ఉన్న మహిళా మార్ట్ ను ఆయన సందర్శించారు. మహిళా మార్ట్ నిర్వహణలో మహిళలు ఎదుర్కొన్న అనుభవాలను, ఇంకా ప్రభుత్వ పరంగా ఏమైనా సౌకర్యాలు కావాలని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కల్తీలేని నాణ్యమైన పదార్థాలు తక్కువ ధరలకు ఖమ్మం మహిళా మార్ట్ లో లభిస్తాయనే నమ్మకం ఉండాలని సూచించారు. 

ఖమ్మం మహిళా మార్ట్ లో స్టాక్ ఎంట్రీ, ఇతర  పనులు చేసేందుకు రెండు కంప్యూటర్లు, ప్రింటర్  ఏర్పాటు చేయాలని, అవసరమైన సామగ్రిని కలెక్టరేట్ నుంచి అందిస్తామని తెలిపారు. అనంతరం ఖమ్మం మహిళా మార్ట్ లో కొన్ని పదార్థాలు, పిండి వంటలను కొనుగోలు చేసి కలెక్టర్ ఫోన్ పే ద్వారా బిల్ చెల్లించారు.

బాల కార్మికులను గుర్తించండి 

ఖమ్మం కార్పొరేషన్​: ‘బాల కార్మికులను గుర్తించండి.. వందశాతం  పాఠశాలల్లో చేర్పించండి ’ అని కలెక్టర్​ ముజమ్మిల్​ ఖాన్​ అన్నారు. బడిఈడు బాలలందరూ బడిలోనే ఉండాలన్నారు. జూన్ 12 ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్​మెంట్ (ఎయిడ్) సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన గోడ పత్రికను కలెక్టరేట్​లోని ఆయన చాంబర్​లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్​శ్రీజ, బాలల సంక్షేమ కమిటీ చైర్​ పర్సన్ భారతరాణి, జిల్లా సంక్షేమ అధికారి రాంగోపాల్ రెడ్డి, డిప్యూటీ లేబర్ కమిషనర్ విజయభాస్కర్ రెడ్డి, జిల్లా బాలల పరిరక్షణ అధికారిని విష్ణువందన, యాంటీ హ్యూమన్ ట్రాకింగ్ యూనిట్ బాధ్యులు ఉదయ్ భాస్కర్, ఎయిడ్ సంస్థ జిల్లా కో-ఆర్డినేటర్ కే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.