రైతులు అప్పుడే పత్తి విత్తనాలు నాటొద్దు : వ్యవసాయ అధికారి డి. పుల్లయ్య

రైతులు అప్పుడే పత్తి విత్తనాలు నాటొద్దు : వ్యవసాయ అధికారి డి. పుల్లయ్య

తల్లాడ, వెలుగు : రైతులు అప్పుడే పత్తి విత్తనాలు నాటొద్దని, భూమిలో తేమ 70 శాతం ఉండేలా చూసుకొని నాటాలని ఖమ్మం వ్యవసాయ ఆఫీసర్ డి. పుల్లయ్య సూచించారు. బుధవారం ఏన్కూర్ మండలంలో పలు విత్తన, ఎరువుల దుకాణాల్లో ఏడీఏ కరుణశ్రీతో కలిసి ఆయన తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు విత్తన కొనుగోలు చేసినప్పుడు డీలర్లు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని చెప్పారు.

సొసైటీ గోడౌన్ సందర్శించి సబ్సిడీపై వచ్చిన జీలుగు సీడ్స్​ పరిశీలించారు. రైతు వేదికలో జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 5.80 లక్షల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, రైతులు నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి నష్టపోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఏన్కూర్ ఏవో నరసింహారావు, అధికారులు బాలకృష్ణ, శ్రీకాంత్, కమలాకర్, నవ్య, భవ్య, భాగ్యలహరి, తదితరులు పాల్గొన్నారు.

తల్లాడ లో తనిఖీలు..

తల్లాడలో పలు విత్తన, ఎరువులు దుకాణాల్లో బుధవారం తల్లాడ వ్యవసాయ ఆఫీసర్ ఎండీ తాజుద్దీన్ ఎస్సై వెంకటకృష్ణ తో కలిసి తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు విత్తనాలు అమ్మాలని, సీడ్ యాక్ట్ ప్రకారంగా రిజిస్టర్ నిర్వహించి విత్తనాలు కొనుగోలు చేసిన రైతులకు రసీదు ఇవ్వాలని డీలర్లకు సూచించారు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.