
- బుక్స్, యూనిఫాం అన్నీ వాళ్ల దగ్గరే కొనాలని రూల్స్
- కార్పొరేట్స్కూళ్ల దోపిడీని పట్టించుకోని ఆఫీసర్లు
- విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తేనే స్పందిస్తున్న అధికారులు
ఖమ్మం, వెలుగు : ఖమ్మం జిల్లాలో కొన్ని ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఫీజుల పేరుతో దోపిడీకి పాల్పడుతున్నాయి. ప్రతియేటా ఇష్టారాజ్యంగా ఫీజులను పెంచుతూ, పేరెంట్స్ నుంచి ముక్కు పిండి రూ.లక్షల్లో వసూలు చేస్తున్నాయి. ఈ ఏడాది పదో తరగతికి రూ.రెండున్నర లక్షలు ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లు కూడా ఖమ్మంలో ఉన్నాయి. టెక్నో, గ్లోబల్, ఇంటర్నేషనల్.. ఇలా రకరకాల అందమైన పేర్లను స్కూల్ పేర్లకు చివరణ పెట్టి హోర్డింగ్ లు, ఫ్లెక్సీలు, కలర్ ఫుల్ బ్రోచర్లతో మార్కెటింగ్ జిమ్మిక్కులకు పాల్పడుతున్నాయి.
బుక్స్, యూనిఫామ్, టై, బెల్ట్, డైరీ.. ఇలా అన్నింటినీ వాళ్ల దగ్గరే కొనాలని నిబంధనలు పెడుతూ, విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చేశాయి. స్కూల్ కు 100 మీటర్లలోపు దూరంలోనే ప్రైవేట్ గా గోడౌన్ ను ఏర్పాటు చేసుకొని, అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండానే వ్యాపారం నిర్వహిస్తున్నాయి. మరికొన్ని స్కూళ్ల యాజమాన్యాలు ఏదో ఒక బుక్ స్టాల్ తో ఒప్పందం చేసుకొని, అక్కడే కొనుక్కోవాలని పేరెంట్స్ కు చెబుతున్నాయి. అక్కడ తప్ప మరెక్కడా ఆ బుక్స్ దొరికే అవకాశం లేకపోవడం తప్పనిసరి పరిస్థితుల్లో ఆ బుక్ స్టాల్లోనే కొనాల్సి వస్తోంది. ఒకటో తరగతికి రూ.3 వేలు, మూడో తరగతికి రూ.7500, ఆరో తరగతికి రూ.9200, పదో తరగతికి రూ.15 వేలు.. ఇలా కేవలం పుస్తకాలకే వేలల్లో
వసూలు చేస్తున్నాయి.
400కు పైగా ప్రైవేట్ స్కూళ్లు
ఖమ్మం జిల్లాలో మొత్తం 400కు పైగా ప్రైవేట్ స్కూళ్లున్నాయి. వీటిలో పది వరకు కార్పొరేట్ మేనేజ్ మెంట్ల ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లున్నాయి. ఈ మేనేజ్ మెట్ల ఆధ్వర్యంలోనే ఒక్క ఖమ్మం నగరంలోనే 50 వరకు స్కూళ్లు నడుస్తున్నాయి. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న చిన్న బడ్జెట్ స్కూళ్లను క్రమంగా టేకోవర్ చేస్తూ, వాటిని కార్పొరేట్ సంస్థలు తమ బ్రాండ్ పేరుతో నడిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ పేరుతో పర్మిషన్ ఉందో, ఆ పేరుతోనే స్కూల్ ను నడిపించాల్సి ఉండగా ఆ రూల్స్ ను లైట్ తీసుకుంటున్నాయి.
ఇక ప్రతియేటా ఫీజులు 20 శాతం నుంచి 30 శాతం వరకు పెంచుకుంటూ పోవడం ఒక ఎత్తయితే, అసలు ఫీజులపైనే కాదు, ప్రైవేట్ స్కూళ్లకు సంబంధించిన ఎలాంటి నిబంధనల అతిక్రమణల విషయంలో విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ స్కూళ్ల వైపు కన్నెత్తి చూడకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
విద్యార్థులు ఫిర్యాదు చేస్తున్నా, విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నా కనీసం ఆయా ప్రైవేట్ స్కూళ్లపై యాక్షన్ తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత వారం రోజులుగా కొన్ని విద్యార్థి సంఘాలు ధర్నా చేసి మరీ ప్రైవేట్ స్కూళ్లు రహస్యంగా గోడౌన్లలో బుక్స్, యూనిఫామ్ లు అమ్మకాలు జరపడంపై బహిరంగంగా నిరసన తెలుపుతున్నారు. యాక్షన్ తీసుకుంటే తమపై రాజకీయ ఒత్తిళ్లు వస్తాయంటూ విద్యాశాఖ అధికారులు చెబుతున్నారని విద్యార్థి సంఘాల నేతలు చెబుతున్నారు.
చివరకు రెండు, మూడు స్కూళ్లలో గోడౌన్స్ను సీజ్ చేసినా, ఒకట్రెండు రోజుల్లోనే మళ్లీ దొడ్డిదారిలో ఆ స్కూళ్ల యాజమాన్యాలు బుక్స్, యూనిఫామ్ ల వ్యాపారం చేస్తున్నాయని తెలుస్తోంది. ఇక కొన్ని స్కూళ్లు అడ్మిషన్లు ఇవ్వాలంటే స్టూడెంట్స్ కు ముందుగా ప్రత్యేక పరీక్షలు పెడుతున్నాయి. వాటిలో పాస్ అయితేనే అడ్మిషన్లు ఇస్తున్నాయి. డొనేషన్లు, క్యాప్టేషన్ ఫీజుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నాయి. స్కూళ్లలో ప్లే గ్రౌండ్ తప్పనిసరిగా ఉండాలని, మున్సిపాలిటీ పరిధిలో 1000 చదరపు మీటర్లు ఉండాలని నిబంధనలు ఉన్నా, ఆ నిబంధన తుంగలో తొక్కి తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి.
ప్రైవేట్ స్కూళ్లపై యాక్షన్ తీసుకోవాలి
కొన్ని ప్రైవేట్స్కూళ్లు ప్రభుత్వ నిబంధనలను అమలు చేయకున్నా, వారిపై జిల్లా విద్యాశాఖ అధికారులు యాక్షన్ తీసుకోకపోవడం బాధాకరం. ఫీజులు వివరాలను నోటీసు బోర్డులో ఉంచాలి. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతీ ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు, పేద వర్గాల విద్యార్థులకు 25 శాతం ఫీజు రాయితీ ఇవ్వాలి. కానీ ఇదెక్కడా అమలు కావడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ ఫీజుల వసూళ్లను అరికట్టాలి. పర్మిషన్ లేని విద్యాసంస్థలను సీజ్ చేయాలి.
రామకృష్ణ, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి, ఖమ్మం