ఈజీ మనీ కోసం చిన్నారుల కిడ్నాప్..రూ.2 లక్షలకు అమ్మేందుకు స్కెచ్

ఈజీ మనీ కోసం చిన్నారుల కిడ్నాప్..రూ.2 లక్షలకు అమ్మేందుకు స్కెచ్

సికింద్రాబాద్, వెలుగు: వేర్వేరే ఏరియాల్లో  ఇద్దరు చిన్నారులను కిడ్నాప్ చేసి ఆటోలో వెళ్తున్న దంపతులను సికింద్రాబాద్​ మహంకాళి పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. ఆదివారం మహంకాళి పీఎస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తి వివరాలు వెల్లడించారు. ఫలక్ నుమాలో ఉండే షేక్ ఇమ్రాన్(36), నిజామాబాద్ కు చెందిన పర్వీన్(30) పాత నేరస్తులు. వీరిద్దరు సహజీవనం చేస్తున్నారు. ఈజీ మనీ కోసం చిన్నారులను కిడ్నాప్ చేసి ఇతర ప్రాంతాల్లో రూ.2 లక్షలకు అమ్మేందుకు స్కెచ్ వేశారు. గుల్బర్గాకు చెందిన మేఘరాజ్ కాలే(40) చాలా ఏండ్ల కింద సిటీకి వచ్చాడు. భార్య, ఏడుగురు పిల్లలతో సికింద్రాబాద్ ప్యారడైస్ దగ్గరలోని ఫుట్ పాత్ పై ఉంటున్నాడు. మేఘరాజ్ ప్యారడైస్ సిగ్నల్ దగ్గర బెలూన్లు అమ్మేవాడు. శనివారం రాత్రి భార్యాపిల్లలతో కలిసి ఫుట్ పాత్ పై నిద్రపోయాడు. మేఘరాజ్ పిల్లల్లో ఒకరిని ఎత్తుకెళ్లేందుకు షేక్ ఇమ్రాన్, పర్వీన్ ప్లాన్ వేశారు. ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు  ఆటోలో ప్యారడైస్ సిగ్నల్ దగ్గరికి వచ్చారు. నిద్రలో ఉన్న మేఘరాజ్ కుమార్తె కరిష్మా(3)ను తీసుకుని వెళ్లిపోయారు. గమనించిన మేఘరాజ్​మహంకాళి పోలీసులకు కంప్లయింట్ చేశాడు.   

ఇలా దొరికారు..

కరిష్మాను కిడ్నాప్ చేసిన తర్వాత ఇమ్రాన్, పర్వీన్ ఆటోలో ట్యాంక్ బండ్ కు, అక్కడి నుంచి బషీర్ బాగ్ మీదుగా సుల్తాన్ బజార్ లోని హనుమాన్ టేక్డీకి వచ్చారు. మహబూబ్ నగర్ కు చెందిన ఓ కుటుంబం అక్కడి ఫుట్ పాత్ పై నిద్రపోతోంది. ఇమ్రాన్ ఆటోను అక్కడ ఆపి తల్లిదండ్రుల మధ్యలో నిద్రపోతున్న ఇద్దరు చిన్నారుల్లో శివకుమార్ అనే 7 నెలల బాబును పర్వీన్ కాళ్లు పట్టుకుని నెమ్మదిగా కిందకి లాగింది.  బాబును తీసుకుని ఆటోలో ఎక్కింది. ఇమ్రాన్ ఆటోను స్టార్ట్ చేసి కొంతదూరం వెళ్లాడు. ప్యారడైజ్ వద్ద జరిగిన చిన్నారి కిడ్నాప్ కంప్లయింట్ తో అలర్ట్ అయిన మహంకాళి పోలీసులు అప్పటికే మిగతా ప్రాంతాల్లోని పోలీసులను అలర్ట్ చేశారు. సుల్తాన్ బజార్ పోలీసులు కిడ్నాపర్ల ఆటోను గుర్తించి ఛేజ్ చేసి వారిని పట్టుకున్నారు. ఇమ్రాన్, పర్వీన్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించారు.