
- కరీంనగర్మాతా శిశు సంరక్షణ కేంద్రంలో శిశువుల తారుమారు
- బాలింత బంధువుల ఆందోళన
- సీసీ కెమెరాలు చెక్ చేసి తప్పు దిద్దుకున్న సిబ్బంది
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ మాతా శిశు కేంద్రంలో ఓ శిశువు మారింది. శిశువుకు సంబంధించిన వ్యక్తులు వచ్చి తమ పాప ఏదని అడిగేదాక.. అక్కడున్న సిబ్బంది గ్రహించలేకపోయారు. చివరకు హాస్పిటల్ లో సీసీ కెమెరాలు చూసి ఎవరి పాపను వారికి ఇచ్చారు. కరీంనగర్ మాతా శిశు సంరక్షణ కేంద్రంలో మంగళవారం సుమారు 20 మంది మహిళలు ప్రసవించారు. ఇందులో కరీంనగర్ కు చెందిన రజియా బేగంకు పాప పుట్టింది. సిటీ పరిధిలోని తీగలగుట్టపల్లికి చెందిన కనకలక్ష్మికి కూడా పాపనే పుట్టింది. వీరిద్దరిని మొదటి అంతస్తులో ఉన్న బేబీ బర్న్ యూనిట్ కు తీసుకెళ్లారు. రజియా బిడ్డను 10.35 కి, కనకలక్ష్మి కూతురును 10.50కి తీసుకెళ్లారు. గంట..రెండుగంటల తర్వాత రజియా బేగం బంధువులు బేబీ బర్న్ యూనిట్ కు వెళ్లగా అక్కడున్న ఆయా పూర్తి వివరాలు చూసుకోకుండానే కనకలక్ష్మి కూతురును ఇచ్చేసింది. రజియా బంధువులు తమ పాపనే అనుకుని కిందికి తీసుకువెళ్లి వారి సంప్రదాయం ప్రకారం పాప చెవిలో అజా కూడా చెప్పారు. కొద్దిసేపటి తర్వాత కనకలక్ష్మి బంధువులు బేబీ బర్న్ యూనిట్ కు వెళ్లి తమ పాపను ఇవ్వాలని అడిగారు. అయితే ఆయా రజియా కూతురును ఇవ్వగా ఆ పాప తమకు సంబంధించిన శిశువు కాదన్నారు. ఈ విషయంలో కొద్దిసేపు ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అధికారులు అక్కడికి వచ్చి హాస్పిటల్ లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. దీంతో పాపను రజియా బంధువులకు ఇచ్చినట్టు గుర్తించారు. తర్వాత వారికి జరిగింది చెప్పి ఎవరి బేబీని వారికి అప్పగించారు.
అందుకే ఇలా జరిగింది...
మాతా శిశు సంరక్షణ కేంద్రంలో డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోంది. మహిళలు డెలీవరీ అయిన వెంటనే శిశువులను బేబీ బర్న్ యూనిట్ కు తీసుకొస్తారు. శిశువులకు నంజు, ఇతర సమస్యలుంటే నయం చేస్తారు. ఇక్కడ షిప్టుల వారీగా ఇద్దరు నర్సులు డ్యూటీ చేస్తారు. వీరికి సహాయకులుగా ఆయా ఉంటుంది. పని ఒత్తిడితో నర్సులు రిజిస్టర్లు రాయడంలో బిజీగా ఉంటారు. దీంతో బేబీలను అప్పగించే పని ఆయాలకు అప్పజెబుతున్నారు. వారికి చదువు రాకపోవడం, అవగాహన లేక శిశువుల చేతులకు కట్టిన ట్యాగ్ లను చూడకుండానే ఇచ్చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు బయటకు వచ్చినప్పుడే తెలుస్తున్నాయి. మంగళవారం మాతా శివు సంరక్షణ కేంద్రంలో ఇంత జరిగినా ఎంసీహెచ్ ఇన్ చార్జి ఆలీం అలాంటి ఘటనే జరగలేదని, పిల్లల డాక్టర్ ఇన్ చార్జి అజయ్ తమకేదీ తెలియదని, అంతా సూపరింటెండెంట్కు తెలుస్తుందని దాటవేశారు.