- సైబర్ అటాక్ జరిగితే వేలాది మంది చనిపోయే ప్రమాదం
- అమెరికాకు చెందిన వినియోగదారుల నిఘా సంస్థ నివేదిక
కొత్తగా కారు కొని హాయిగా హ్యాపీగా జాలీ రైడ్ చేస్తే ఆ ఆనందమే వేరు. వైఫైకి కనెక్ట్ చేసుకుని చెవులకు వినసొంపైన మ్యూజిక్ వింటూ వెళితే వచ్చే మజా మస్తుంటది. కానీ, ఆ ఆనందానికి బ్రేకులు వేసేలా కొత్త కార్లు ఈజీగా హ్యాక్ అయ్యే ముప్పు పొంచి ఉంది. కంపెనీలు కార్లలో పెడుతున్న సాఫ్ట్వేర్లు హ్యాకర్లు దాడి చేసేలా ఉన్నాయి. మాస్ సైబర్ అటాక్ జరిగితే వేలాది ప్రాణాలు రోడ్డుకు బలయ్యే ప్రమాదముంది. ఈ సంచలన విషయాన్ని అమెరికాలోని లాస్ఏంజిలిస్కు చెందిన వినియోగదారుల నిఘా సంస్థ తేల్చింది. ‘కిల్ స్విచ్: వై కనెక్టెడ్ కార్స్ కెన్ బీ కిల్లింగ్ మెషీన్స్ అండ్ హౌ టు టర్న్ దెమ్ ఆఫ్’ పేరిట నివేదిక విడుదల చేసింది. కార్ల పరిశ్రమలోని 20 నిఘా వ్యక్తులతో ఐదు నెలల పాటు అధ్యయనం చేయించి ఈ నివేదికను తయారు చేసింది. ‘‘సేఫ్టీ క్రిటికల్ సిస్టమ్స్ను ఇప్పుడు బాగా ఇంటర్నెట్కు అనుసంధానిస్తున్నారు. కానీ, కంపెనీలు మాత్రం సరైన భద్రతా చర్యలు లేకుండానే ఆ సిస్టమ్స్ను తయారు చేస్తున్నాయి. దాని వల్ల పెద్ద సంఖ్యలో హ్యాక్ జరిగినప్పుడు కనీసం డిస్కనెక్ట్ చేయడానికి వీలు లేకుండా పోతుంది” అని నివేదిక పేర్కొంది. ఆ విషయం కంపెనీలకు తెలిసినా నిమ్మకు నీరెత్తనట్టే ఉంటున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. సేఫ్టీని పక్కనబెట్టి లాభాల కోసమే పాకులాడుతున్నాయని వెల్లడించింది. ఇంజన్ను స్టార్ట్ చేయడం దగ్గర్నుంచి, ఏసీని ఆన్ ఆఫ్ చేయడం, లొకేషన్ను చెక్ చేసుకోవడం వంటివన్నీ స్మార్ట్ఫోన్ ద్వారా చేసుకోవచ్చని, కాబట్టి ఇంటర్నెట్లో హ్యాకర్లు వాటిని ఈజీగా హ్యాక్ చేయడానికి వీలుంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘ఈ ప్రమాదాన్ని తప్పించుకోవాలంటే అన్ని కొత్త వాహనాల్లోనూ ‘ఇంటర్నెట్ కిల్ స్విచ్ పెట్టాలి. కొత్త మోడళ్లలో సేఫ్టీ క్రిటికల్ వ్యవస్థలను ఇంటర్నెట్ ఇన్ఫోటెయిన్మెంట్ నుంచి తీసేయాలి” అని సిఫార్సు చేసింది. ప్రజాప్రతినిధులు, కార్ల కంపెనీలు వీటిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించింది.