ఇద్దరు కొడుకులను చంపి.. తల్లి ఆత్మహత్యాయత్నం

ఇద్దరు కొడుకులను చంపి.. తల్లి ఆత్మహత్యాయత్నం

విషమంగా తల్లి పరిస్థితి
సంగారెడ్డి, వెలుగు: పిల్లల అనారోగ్యం, కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇద్దరు బిడ్డలను చంపి తల్లి ఆత్మహత్యకు యత్నించింది. పోలీసులు, కుటుంబీకుల వివరాల ప్రకారం.. సంగారెడ్డిలోని ఇండియన్ బ్యాంక్ లో క్యాషియర్ గా పనిచేస్తున్న శివశంకర్, జోత్స్నదంపతులకు రుద్రాంశ్(6), దేవాన్ష్(4) ఇద్దరు కొడుకులు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన శివశంకర్ కు ఏడు నెలల క్రితం సంగారెడ్డి ట్రాన్స్​ఫర్​అయింది. శాంతి నగర్ లో కిరాయి ఇంట్లో శివశంకర్ కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. పెద్దబ్బాయి రుద్రాంశ్​కు పుట్టుక నుంచి రెండు కిడ్నీల సమస్య ఉంది. దేవాన్ష్ కూడా మోషన్ సమస్యతో బాధపడుతున్నాడు. కొంతకాలంగా ఇద్దరు పిల్లలకు హైదరాబాద్ లోని రెయిన్ బో హాస్పిటల్​లో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. పిల్లల ఆరోగ్య సమస్యలతో పాటు ఈ మధ్య వీరికి ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువయ్యాయి. పిల్లలకు జీవితాంతం ఆరోగ్య సమస్యలు ఉంటాయని డాక్టర్లు ఇటీవల చెప్పడంతో మనస్తాపానికి గురైన జ్యోత్స్న పిల్లలను చంపి తాను చావాలనుకుంది. శివశంకర్ శుక్రవారం మధ్యాహ్నం బ్యాంకుకు వెళ్లిన తర్వాత పిల్లల మెడకు చున్నీ బిగించి చంపేసింది. తర్వాత ఇంటికి తాళం వేసి పట్టణ శివారులో ఉన్న మహబూబ్ నహర్ చెరువు వద్దకు వెళ్లి భర్తకు సెల్ఫీ ఫోటో పంపించి చెరువులో దూకింది. అక్కడే ఉన్న స్థానికులు ఆమెను కాపాడి భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పారు. వెంటనే శివశంకర్ అక్కడకు చేరుకున్నాడు. భార్యను తీసుకొని ఇంటికి వెళ్లేసరికి ఇద్దరు కొడుకులు మంచంపై చనిపోయి కనిపించారు. వెంటనే భార్య, పిల్లలను ఆసుపత్రికి తీసుకెళ్లగా పిల్లలు అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. జ్యోత్స్నకు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి ఐసీయూ లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. శివశంకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.