శ్రీనగర్: టెర్రరిస్టుల దాడులతో ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు కశ్మీర్ను వీడి వెళ్తున్నారు. లోయలో పరిస్థితులు భయానకంగా ఉన్నాయని కార్మికులు అంటున్నారు. ఇటీవలి ఘటనలు భయపెడుతున్నాయని.. పిల్లలతో ఇక్కడ ఉండలేమని వాపోయారు. ఉగ్రవాదులకు భయపడి మైగ్రంట్ లేబర్స్ తిరిగి సొంత రాష్ట్రాలకు వెళ్తున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
కాగా, గడిచిన రెండ్రోజుల్లో కశ్మీర్లో ఇతర రాష్ట్రాలకు చెందిన నలుగుర్ని టెర్రరిస్టులు కాల్చి చంపారు. శనివారం శ్రీనగర్ ఈద్గా దగ్గర జరిగిన దాడిలో బిహార్కు చెందిన గోల్ గప్పా వ్యాపారి చనిపోయాడు. అదే టైంలో పుల్వామాలో యూపీకి చెందిన కార్పెంటర్ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ నెలలో మొత్తం 11 మంది పౌరులను టెర్రరిస్టులు కాల్చి చంపగా.. అందులో ఐదుగురు ఇతర రాష్ట్రాలకు చెందిన వారున్నారు. ఈ ఘటనలను పరిశీలిస్తే ఇతర రాష్ట్రాల వారిని కశ్మీర్ నుంచి వెళ్లగొట్టేందుకు టెర్రరిస్టులు ప్రయత్నాలు చేస్తున్నారని కొందరు అధికారులు చెబుతున్నారు.