కృష్ణా జలాల్లో వాటాపై నోరెత్తని సీఎం కేసీఆర్​

కృష్ణా జలాల్లో వాటాపై నోరెత్తని సీఎం కేసీఆర్​
  • ఏపీలో బీఆర్​ఎస్​ విస్తరణ కోసం తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు
  • సంగమేశ్వరం, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులపై నిర్లక్ష్యం
  • షెడ్యూల్​ 9, 10 సంస్థల విభజనపైనా అదే వైఖరి
  • తెలంగాణపై కేంద్రానికి ఏపీ సర్కార్​ వరుస కంప్లైంట్స్​

హైదరాబాద్, వెలుగు: రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను కేసీఆర్​ సర్కారు కుదువ పెడుతున్నది. తెలంగాణ, ఏపీ మధ్య నలుగుతున్న విభజన సమస్యలపై నోరుమెదపడం లేదు. ఏపీ మాత్రం దూకుడుగా ముందుకు పోతున్నది. కేంద్రానికి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నది. అయితే,  టీఆర్​ఎస్​ను బీఆర్​ఎస్​గా మార్చిన కేసీఆర్​.. ఏపీలో తన పార్టీని విస్తరించే పనిలో పడ్డారు. పలువురు ఏపీ నేతలను బీఆర్​ఎస్​లోకి చేర్చుకున్నారు. బీఆర్​ఎస్​ ఏపీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్​ను కూడా నియమించారు. ఇలాంటి పరిస్థితుల్లో విభజన సమస్యలపై మాట్లాడితే ఏపీలో తమ పార్టీపై  వ్యతిరేకత వస్తుందని, అందుకే  ఆయన సైలెంట్​ అయినట్లు బీఆర్​ఎస్​ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. ఇప్పటికే కృష్ణా జలాల్లో వాటాపై తెలంగాణ సర్కారు కాడి వదిలేసింది. ఇప్పుడు ఆస్తుల విభజన సమస్యనూ పక్కనపెట్టేసిందన్న విమర్శలు వస్తున్నాయి. సమస్యల పరిష్కారానికి కేంద్రం నిర్వహిస్తున్న మీటింగ్​లకు కేసీఆర్​ వెళ్లడం లేదు. 

ఏపీ ఫిర్యాదులు చేస్తున్నా..!

నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంతోనే తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఆ నినాదంతోనే రాష్ట్రం ఏర్పాటైంది. కానీ, ఇప్పుడు కేసీఆర్​ సర్కార్​.. వాటినే పట్టించుకోవట్లేదని, మన హక్కులను పక్క రాష్ట్రం వద్ద తాకట్టు పెడ్తున్నదనే ఆరోపణలు ఉన్నాయి. నిరుడు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన ఏపీ సీఎం జగన్​.. తెలంగాణ తీరుపై అనేక ఫిర్యాదులు చేశారు. తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన రూ.6,886 కోట్ల కరెంట్​ బకాయిలను ఇప్పటికీ చెల్లించడం లేదని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వాటిని ఇప్పించాలని కోరారు.

షెడ్యూల్​ 9, 10లోని సంస్థల విభజనపైనా ఆయన ఫిర్యాదు చేశారు. కృష్ణా జలాలకు సంబంధించి కేంద్ర మంత్రి భూపీందర్​ యాదవ్​కు  డిసెంబర్​లో ఫిర్యాదు చేశారు. శ్రీశైలం, నాగార్జున సాగర్​ ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ సర్కారు ప్రొటోకాల్స్​ పాటించట్లేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పాలమూరు-–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను అనుమతులు లేకుండానే కడుతున్నారంటూ ఫిర్యాదు చేశారు. అయితే, ఇంత జరుగుతున్నా సీఎం కేసీఆర్​ మాత్రం స్పందించడం లేదు. కేంద్రం నిర్వహించిన అపెక్స్​ కౌన్సిల్​ మీటింగులకూ ఒక్కసారి మినహా ఎప్పుడూ ఆయన హాజరుకాలేదు. 2020లో జరగాల్సిన అపెక్స్​ కౌన్సిల్​ మీటింగులను పలుమార్లు వాయిదా వేయించారు. వాస్తవానికి ఆ ఏడాది ఆగస్టు 19న పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు టెండర్లు ఖరారు కావాల్సి ఉంది. అయితే, 20వ తేదీ తర్వాత అపెక్స్​ కౌన్సిల్​ మీటింగ్​ పెట్టాలని కేంద్రానికి అధికారులతో కేసీఆర్​ లేఖలు రాయించారు. ఏపీ ప్రయోజనాల కోసమే ఇలా చేశారని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత 2021 ఆగస్టులో జరిగిన కృష్ణా, గోదావరి బోర్డుల మీటింగులకు మన అధికారులు హాజరు కాలేదు. ఇటు ఏపీ కడుతున్న సంగమేశ్వరం ప్రాజెక్టుపై ‘వెలుగు’ ప్రత్యేక కథనాలు ప్రచురించేంత వరకు కూడా తెలంగాణ సర్కారు స్పందించలేదు. అప్పటిదాకా ఆ ప్రాజెక్టే లేదంటూ వాదిస్తూ వచ్చిన రాష్ట్ర సర్కారు.. ఆ ప్రాజెక్టులో కీలక దశలు పూర్తయ్యాక నిద్రలేచింది. ఆ ప్రాజెక్టుపై ముందు నుంచీ నిర్లక్ష్యంగానే వ్యవహరించింది. రాష్ట్ర సర్కారు తీరుతో ఇప్పటికే సంగమేశ్వరం, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుల విషయంలో ఏపీ జోరు పెంచింది. మన పాలమూరు–-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల్లో వేగం మాత్రం పెరగలేదు.

తూతూ మంత్రంగా మీటింగులకు హాజరు

ఆస్తుల విభజన పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం త్రీమెన్​ కమిటీని నియమించింది. ప్రతి నెలా ఆ కమిటీ రెండు రాష్ట్రాలతో మీటింగులను పెడ్తున్నది. ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం 28 రివ్యూ మీటింగులను నిర్వహించింది. రాష్ట్రం నుంచి అధికారులు ఆ మీటింగులకు హాజరవుతున్నా తెలంగాణ స్టాండ్​ను మాత్రం గట్టిగా వినిపించలేకపోతున్నారు. నిరుడు నవంబర్​, డిసెంబర్​లోనూ జరిగిన మీటింగుల్లోనూ తెలంగాణ ప్రయోజనాలపై తూతూ మంత్రంగా గళం వినిపించారే తప్ప గట్టిగా మాట్లాడలేదన్న 
విమర్శలున్నాయి.

తేలని సమస్యలు ఎన్నో..!

  • వాస్తవానికి షెడ్యూల్​ 9, 10లోని వివిధ ప్రభుత్వ సంస్థల ఆస్తుల పంపిణీ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎడతెగని పంచాయితీ నడుస్తున్నది.
  • షెడ్యూల్​ 9లోని 91 సంస్థలు, షెడ్యూల్​ 10లోని 142,  ఏ షెడ్యూల్​లోనూ లేని మరో 12 సంస్థల ఆస్తుల విభజన తేలాల్సి ఉంది.
  • దాదాపు 91 శాతం సంస్థలన్నీ హైదరాబాద్​ కేంద్రంగానే ఉన్నాయి.
  • తేల్చాలంటూ ఏపీ సర్కారు సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఆస్తుల విభజనలో తెలంగాణ ఆలస్యం చేస్తున్నదని ఏపీ వాదించింది. ఆస్తుల్లో తమకు రావాల్సిన వాటాపై 2016 జూన్​ 2 నుంచి లెక్కగట్టి ఏటా 15 శాతం వడ్డీ మేరకు తెలంగాణ చెల్లించేలా ఆదేశాలివ్వాలని అంటున్నది.
  • సింగరేణి కాలరీస్​ వంటి సంస్థల్లోనూ వాటాను ఏపీ కోరుతున్నది. సమస్య పరిష్కారానికి స్వతంత్ర మధ్యవర్తిని లేదా రిటైర్డ్​ సుప్రీంకోర్టు జడ్జిని నియమించాలంటున్నది.
  • కోర్టులో తెలంగాణ వాదనల్లో పస లేకపోవడంతో ఆ సమస్యలపై వెంటనే తేల్చాలంటూ ఇటు తెలంగాణ సర్కారుతో పాటు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది.

ఎవరూ మాట్లాడొద్దు!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదిన్నరేండ్లు అయిపోతున్నది. కానీ, రాష్ట్రంలో ఉన్న కామన్​ ఆస్తుల విభజన సమస్య మాత్రం ఇంతవరకూ కొలిక్కిరాలేదు. ఇప్పుడు బీఆర్​ఎస్​ విస్తరణ నేపథ్యంలో విభజన సమస్యల మీద ఎవరూ మాట్లాడొద్దని పార్టీ నేతలకు కేసీఆర్​ ఆదేశాలిచ్చినట్టు తెలుస్తున్నది. ఏపీ ప్రజలను బీఆర్​ఎస్​ వైపు తిప్పుకోవాలంటే ఆ సమస్యలపై స్పందించకపోవడమే మంచిదని కేసీఆర్​ భావిస్తున్నట్టు బీఆర్​ఎస్​ వర్గాలు చెప్తున్నాయి.