- బీజేఎల్పీ నేతగా మహేశ్వర్ రెడ్డి
- ఉపనేతలుగా పాయల్, కాటిపల్లి
- సెక్రటరీగా రామారావు పటేల్
- పార్టీ చీఫ్ విప్ గా హరీశ్ బాబు
- రాజాసింగ్ కు మినహా అందరికీ పదవులు
- అధికారిక ప్రకటన విడుదల
హైదరాబాద్: భారతీయ జనతాపార్టీ శాసన సభాపక్ష నేతగ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ని నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి లేఖ విడుదల చేశారు. ఉప నేతలుగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి వ్యవహరించనున్నారు. పార్టీ చీఫ్ విప్ గా సిర్పూర్ ఎమ్మెల్యే హరీశ్ బాబును నియమించారు. విప్ గా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా వ్యవహరిస్తారని తెలిపారు. ట్రెజరర్ గా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డిని నియమిస్తున్నట్టు వివరించారు. ఈ ఉత్వర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని కిషన్ రెడ్డి వివరించారు.
అటకెక్కిన బీసీ మంత్రం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పిన బీజేపీ కనీసం శాసన సభా పక్ష నేతను కూడా చేయలేకపోయిందనే విమర్శలు గుప్పుమంటున్నాయి. బీసీ సామాజిక వర్గానికి చెందిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మినహా అందరికీ పదవులు కేటాయించడం గమనార్హం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, శాసన సభాపక్ష నేత ఇద్దరూ ఓసీలు. వీరిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే కావడం అనేక విమర్శలకు తావిస్తోంది.